కలం, ఖమ్మం బ్యూరో: రైతులకు మంత్రి పొంగులేటి (Minister Ponguleti) శుభవార్త చెప్పారు. ఈ ఏడాది భారీగా వడ్లు, మొక్కజొన్న పంట పండినప్పటికీ ప్రతి గింజను మద్దతు ధరకు కొనుగోలు చేస్తామని మంత్రి స్పష్టం చేశారు. సకాలంలో ధాన్యం డబ్బులు ఖాతాల్లో జమ చేస్తామన్నారు. పేదల సంక్షేమం, రైతుల అభివృద్ధే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. బుధవారం ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం గువ్వల గూడెం గ్రామంలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన ప్రజాదర్బార్లో ఖమ్మం ఎంపీ రామ సహాయం రఘురాంరెడ్డి, జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్, అదనపు కలెక్టర్ పీ శ్రీనివాస్ రెడ్డిలతో కలిసి పాల్గొన్నారు.
పేదలకు అండగా ప్రజా ప్రభుత్వం
ప్రజల దీవెనలతో ఏర్పడిన ప్రజాప్రభుత్వం గడచిన రెండు సంవత్సరాల నాలుగు నెలల కాలంలో పేద ప్రజలకు అండగా ఉంటూ, పేదల అభివృద్ధి సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తుందన్నారు. రైతు సంక్షేమంలో ఎక్కడ తగ్గకుండా, నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించడంలో దేశంలోనే అన్ని రాష్ట్రాల కంటే ముందున్నామన్నారు. అలాగే ప్రభుత్వం కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలని లక్ష్యంతో పని చేస్తుందన్నారు.
అర్హులందరికీ ఇందిరమ్మ ఇండ్లు
ఇందిరమ్మ ఇండ్ల పథకం క్రింద ఇప్పటికే భారీసంఖ్యలో ఇండ్లు మంజూరు చేశామని, అర్హులైన ప్రతి లబ్ధిదారుడికి ఇండ్లు అందించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు. మే నెలాఖరికి రెండవ విడత ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ శ్రీనివాస్, తహసీల్దార్ రాంప్రసాద్, సంబంధిత అధికారులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

