కలం, వెబ్ డెస్క్ : విశాఖ పట్నం జిల్లా తర్లువాడలో గూగుల్ ఏఐ (ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్) డేటా సెంటర్ నిర్మాణానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శంకుస్తాపన చేసింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఏపీ మంత్రి నారా లోకేశ్ (Minister Lokesh) మాట్లాడారు. విశాఖలో గూగుల్ ఏఐ డేటా హబ్ తో ఐటీ, సైబర్ సెక్యూరిటీ ఎకో సిస్టమ్ ఏర్పడుతుందని తెలిపారు. ఇది డేటా సెంటర్ కు శంకుస్థాపన మాత్రమే కాదని..కొత్త చరిత్రకు పునాది వేసిన పవిత్రమైన రోజు అని లోకేశ్ చెప్పుకొచ్చారు.
‘ఈ రోజుతో వైజాగ్ ముఖచిత్రం మారబోతుంది. ఇప్పటివరకు ఒక లెక్క.. ఇప్పటి నుంచి మరోలెక్క’ అని లోకేశ్ చెప్పారు. 2019కి ముందే డేటా సెంటర్ ఏర్పాటుకు ప్రస్తావన వచ్చిందన్నారు. అనాడు తీసుకున్న నిర్ణయం నేడు కార్యరూపం దాల్చిందని వెల్లడించారు. వైజాగ్ లో జీ అంటే గూగుల్ అని.. ఇక నుంచి గ్లోబల్ ఐటీ మ్యాప్ లో విశాఖ అనే పవిత్ర పట్టణం ఉండబోతుందని మంత్రి లోకేశ్ వ్యాఖ్యానించారు.

