కలం, వెబ్ డెస్క్ : స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గ పరిధిలోని ఆలయాల అభివృద్ధికి సమగ్రమైన మాస్టర్ ప్లాన్ రూపొందించాలని స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి దేవాదాయ శాఖ కమిషనర్ హనుమంత రావుతో సమీక్ష జరపడంపై దేవాదాయ శాఖ మంత్రి (Konda Surekha ) కొండా సురేఖ అసహనం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. తన ప్రమేయం లేకుండా దేవాదాయ శాఖ కమిషనర్ తో ఎలా సమీక్ష జరుపుతారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారట. దీంతో ఈ విషయంపై ఆమె కాసేపట్లో రాష్ట్ర అధినాయకత్వానికి, కాంగ్రెస్ హైకమాండ్ కు ఫిర్యాదు చేయనున్నట్లు సమాచారం అందుతోంది.
ఈ విషయంపై ఆమె సీఎం రేవంత్ రెడ్డికి, పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ కుమార్ గౌడ్, తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్ తో పాటు AICC అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే,
AICC ప్రధాన కార్యదర్శి కె.సి. వేణుగోపాల్, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి విడివిడిగా లేఖలు రాసేందుకు సిద్ధం అయ్యారని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. తన పాలన పరమైన అంశాల్లో ఇతరులు జోక్యం చేసుకోవడం ఏంటి? అని ఆమె లేఖలో ప్రస్తావించనున్నారు. ఈ ఘటనతో ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన నేతల్లో వర్గ విభేదాలు బయటపడ్డాయి. ఈ ఇష్యూపై కాంగ్రెస్ అధిష్టానం ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.
ఇదిలాఉంటే ఇటీవల ప్రభుత్వం ఏర్పాటు చేసిన యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయ బోర్డు ఏర్పాటులో కూడా మంత్రి కొండా సురేఖ అసంతృప్తిగా ఉన్నట్లు ప్రచారం జరిగింది. తన శాఖకు సంబంధించిన అత్యంత కీలకమైన ఈ బోర్డు ఏర్పాటు విషయంలో దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్న తన అభిప్రాయాలను పూర్తిగా పరిగణనలోకి తీసుకోలేదనే భావనతో ఆమె ఉన్నట్లు తెలిసింది. ఈ క్రమంలోనే ఆమె ఇటీవల జరిగిన తెలంగాణ రాష్ట్ర కేబినెట్ సమావేశానికి హాజరుకాలేదని రాజకీయ వర్గాల్లో చర్చ జరిగింది. ఈ నేపథ్యంలో తాజాగా ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఇష్యూ జరిగింది. వీటన్నింటిపై ఆమె కాంగ్రెస్ అధిష్ఠానానికి లేఖ రాయనుందని రాజకీయ వర్గాల్లో గట్టిగా చర్చ నడుస్తోంది.

