కలం, మెదక్ బ్యూరో: ప్రపంచ స్థాయి సాంకేతిక విద్యను అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం విద్యా సంస్థల్లో అవసరమైన అన్ని సదుపాయాలను కల్పిస్తోందని, విద్యార్థులు ఈ ఆధునిక సౌకర్యాలను సద్వినియోగం చేసుకుని ఉన్నత లక్ష్యాలను సాధించాలని మంత్రి దామోదర రాజనర్సింహ (Minister Damodar Raja Narasimha) ఆకాంక్షించారు. సంగారెడ్డి జిల్లా చౌటకూర్ మండలం సుల్తాన్పూర్ జేఎన్టీయూ (JNTUH Sultanpur) ఇంజినీరింగ్ కళాశాలల విద్యార్థుల కోసం ఏర్పాటు చేసిన స్మార్ట్ కంప్యూటర్ ల్యాబ్ను, నూతన బస్సులను మంత్రి దామోదర రాజనర్సింహ శనివారం ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. విద్యార్థులకు నాణ్యమైన సాంకేతిక విద్యతో పాటు, డిజిటల్ విద్యకు ప్రాధాన్యత ఇస్తూ ఏర్పాటు చేసిన స్మార్ట్ కంప్యూటర్ ల్యాబ్ ద్వారా విద్యార్థులు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని నేర్చుకునే అవకాశం లభిస్తుందని, ఉద్యోగ అవకాశాలకు అవసరమైన నైపుణ్యాలను పెంపొందించుకోవడానికి ఇది దోహదపడుతుందని మంత్రి తెలిపారు. ఈ కార్యక్రమంలో జేఎన్టీయూహెచ్ వైస్ ఛాన్సలర్ డా.కిషన్ కుమార్ రెడ్డి, విశ్వవిద్యాలయ అధికారులు, అధ్యాపకులు, విద్యార్థులు, పాల్గొన్నారు.

