కలం, మెదక్ బ్యూరో: సంగారెడ్డి జిల్లా అందోల్ మండలం జోగిపేట (Jogipet)లోని ఎంఎన్ ఫంక్షన్ హాల్ వద్ద ఘోర ఆర్టీసీ బస్సు ప్రమాదం (RTC Bus Accident) జరిగింది. రెండు ఆర్టీసీ బస్సులు ఒకదానికొకటి బలంగా ఢీకొనడంతో పలువురు ప్రయాణికులు గాయపడ్డారు. వివరాల్లోకి వెళ్తే.. శనివారం నర్సాపూర్ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు అన్నసాగర్ వైపు నుంచి జోగిపేటకు వస్తోంది. అదే సమయంలో వెనుక నుంచి అతివేగంగా వచ్చిన హైదరాబాద్-2 డిపోకు చెందిన బస్సు దానిని బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాద దాటికి రెండు ఆర్టీసీ బస్సుల అద్దాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. దీంతో బస్సులో ప్రయాణిస్తున్న పలువురు ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి.
వెంటనే స్థానికులు స్పందించి, గాయపడిన ప్రయాణికులను చికిత్స నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారికి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. గత కొన్ని రోజులుగా అన్నసాగర్ – జోగిపేట్ రోడ్డు విస్తరణ పనులు అత్యంత నత్తనడకన సాగుతున్నాయి. దీని వల్ల రోడ్డు చాలా ఇరుకుగా మారిందని, హైదరాబాద్ డిపో బస్సు డ్రైవర్ అతివేగంతో పాటు ఈ ఇరుకైన రోడ్డు కూడా ప్రమాదానికి ఒక ముఖ్య కారణమని, రోడ్డు పనులు త్వరగా పూర్తి చేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

