కలం, ఖమ్మం బ్యూరో: పోలవరం ప్రాజెక్టు బ్యాక్వాటర్తో భద్రాచలాని (Bhadrachalam)కి పొంచి ఉన్న ముప్పుపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మౌనం వీడి, వాస్తవాలను వెంటనే ప్రజల ముందుంచాలని సీపీఐ (CPI) రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కల్లూరి వెంకటేశ్వరరావు, రాష్ట్ర సమితి సభ్యులు రావులపల్లి రవికుమార్ డిమాండ్ చేశారు. శనివారం స్థానిక సీపీఐ కార్యాలయంలో జరిగిన సమావేశంలో వారు మాట్లాడారు. గోదావరికి వరదలు వచ్చినప్పుడు హడావుడి చేయడం, ఆ తర్వాత సమస్యను గాలికొదిలేయడం అధికారులకు పరిపాటిగా మారిందని విమర్శించారు.
యుద్ధ ప్రాతిపదికన పనులు పూర్తి చేయాలి..
పోలవరం బ్యాక్వాటర్ (Polavaram Backwater) ప్రభావంపై ఉన్న శాస్త్రీయ నివేదికలను దాచకుండా బహిర్గతం చేసి ప్రజల ఆందోళనను తొలగించాలన్నారు. భద్రాచలం మనుగడను ప్రశ్నార్థకం చేయకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఒకరిపై ఒకరు నెపం నెట్టుకోవడం మాని శాశ్వత పరిష్కారం చూపాలని హెచ్చరించారు. వరదల నుంచి పట్టణాన్ని రక్షించాల్సిన కరకట్ట నిర్మాణం అసంపూర్తిగా ఉండటం పాలకుల నిర్లక్ష్యానికి నిదర్శనమని విమర్శించారు. పెండింగ్ పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని వారు కోరారు. అలాగే రాబోయే వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని అధికారులు సమన్వయంతో కదలాలని సూచించారు.
ఏజెన్సీ గ్రామాల్లో విషజ్వరాలు రాకముందే ముందస్తు వైద్య శిబిరాలు, మందులు అందుబాటులో ఉంచాలని వారు డిమాండ్ చేశారు. పట్టణం నుంచి మారుమూల గ్రామాల వరకు పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. భద్రాచలం (Bhadrachalam) శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయ అభివృద్ధి పనుల్లో నాణ్యతకు తిలోదకాలు ఇవ్వకుండా భక్తుల సౌకర్యార్థం కోట్లాది రూపాయల ప్రజాధనంతో చేపడుతున్న పనులపై నిరంతర పర్యవేక్షణ ఉండాలని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో సీపీఐ నాయకులు నరాటి ప్రసాద్, కంచర్ల జమలయ్య, కంభం మెట్టు శ్రీను, తదితరులు పాల్గొన్నారు.
Read Also: హరీశ్ అత్యంత అవినీతిపరుడు.. రేవంత్ సంచలన వ్యాఖ్యలు
Follow Us On: X(Twitter)

