కలం, నిర్మల్: బీజేఎల్పీ నేత, నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి (Alleti Maheshwar Reddy) కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ను శనివారం మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. హైదరాబాద్ పర్యటనకు వచ్చిన కేంద్ర మంత్రిని కలిసిన ఎమ్మెల్యే ఆర్మూర్ – నిర్మల్ – ఆదిలాబాద్ నూతన రైల్వే లైన్ ప్రాజెక్టు పనులను వేగవంతం చేసి, వీలైనంత త్వరగా పూర్తి చేయాలని విజ్ఞప్తి చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఈ రైల్వే లైన్ నిర్మాణం పూర్తయితే నిర్మల్ జిల్లా ప్రజలతో పాటు ఉత్తర తెలంగాణ ప్రాంత ప్రజలకు రవాణా సౌకర్యాలు మెరుగుపడటమే కాకుండా, వాణిజ్య కార్యకలాపాలు, ఆర్థికాభివృద్ధికి గణనీయంగా దోహదపడుతుందని వివరించారు. ప్రాజెక్టును ప్రాధాన్యతగా పరిగణించి త్వరితగతిన పూర్తి చేసేందుకు అవసరమైన పరిపాలనా, ఆర్థిక చర్యలు చేపట్టాలని కేంద్ర మంత్రిని కోరినట్లు తెలిపారు.

