కలం, వెబ్ డెస్క్ : రాను రాను వైట్ కాలర్ జాబ్స్ గాల్లో దీపాలైపోతున్నాయి. ఐటీ లేదా టెక్ ఉద్యోగులకు దినదిన గండంగా మారుతోంది. ఎప్పుడు ఎవరి ఉద్యోగం పోతుందో తెలియట్లేదు. ఏ సంస్థ ఎప్పుడు ఎవర్ని తీసేస్తుందో తెలియక అంతా సతమతం అవుతున్నారు. ఇప్పటికే గూగుల్, టీసీఎస్, అమెజాన్, ఒరాకిల్ లాంటి సంస్థలు ఉద్యోగులను తీసేశాయి. ఇప్పుడు మెటా (Meta) సంస్థ కూడా ఇదే బాట పడుతోంది. మెటాలో తాజాగా 16వేల మందిని తీసేస్తున్నట్టు రాయిటర్స్ కథనంలో పేర్కొంది.
ప్రస్తుతం మెటా (Meta) సంస్థలో 79వేల మంది ఉన్నారని.. అందులో 20 శాతం మందిని అంటే 16వేల మందిని ప్రపంచ వ్యాప్తంగా తీసేస్తున్నట్టు రాయిటర్స్ తెలిపింది. వీరిని ఎప్పుడు తీసేస్తారనేది మాత్రం స్పష్టంగా రాయిటర్స్ చెప్పలేదు. ప్రస్తుతం అన్ని టెక్ సంస్థలు ఏఐ వినియోగాన్ని పెంచుకోడానికి ఉద్యోగులను తీసేస్తున్నాయి. మెటా కూడా ఏఐ వినియోగాన్ని పెంచుకునేందుకు లేఆఫ్స్ ప్రకటించబోతోంది. 2028 కల్లా ఏఐ డేటా సెంటర్ల వినియోగం కోసం మెటా సంస్థ 600 బిలియన్ డాలర్ల పెట్టుబడికి సిద్ధమైంది.

