కలం, వెబ్డెస్క్: మేఘాలయ (Meghalaya) మహిళా క్రికెట్లో తీవ్ర కలకలం రేగుతోంది. రాష్ట్ర అండర్-23 మహిళా క్రికెట్ జట్టు సభ్యులు (Women Cricketers) లైంగిక వేధింపుల ఆరోపణలు చేశారు. ఈ ఘటన ఇప్పుడు దేశవ్యాప్తంగా పెద్ద సంచలనంగా మారింది. ప్రస్తుతం ఈ వ్యవహారంపై మేఘాలయ రాష్ట్ర మహిళా కమిషన్ తీవ్రంగా స్పందించింది. దీనిపై వివరణ ఇవ్వాలని మేఘాలయ క్రికెట్ అసోసియేషన్ (MCA) అధికారులను కమిషన్ ఆదేశించింది. ఆరోపణలు ఎదుర్కొంటున్న సిబ్బందికి కూడా సమన్లు జారీ చేసింది.
గత ఏడాది డిసెంబర్ 2025లో ఈ దారుణం వెలుగుచూసింది. కోచింగ్, మేనేజ్మెంట్ సిబ్బంది తమతో తప్పుగా ప్రవర్తించారని కొంతమంది యువ మహిళా క్రికెటర్లు ఫిర్యాదు చేశారు. వాట్సాప్ వంటి యాప్లలో అభ్యంతరకర సందేశాలు పంపించారని పేర్కొన్నారు. అయితే సీనియర్ అధికారులకు ఈ విషయం తెలిసినా పట్టించుకోలేదు. నెలల తరబడి ఎలాంటి చర్యలు తీసుకోకుండా నిర్లక్ష్యం చేశారనే ఆరోపణలు వస్తున్నాయి.న్యాయం కోసం బాధితులు అసోసియేషన్ అంబుడ్స్మన్ను ఆశ్రయించారు. కానీ అక్కడ కూడా కొందరు అధికారులు ఈ విచారణను అడ్డుకోవడానికి ప్రయత్నించారు. ఇంత జరుగుతున్నా, ఆరోపణలు ఎదుర్కొంటున్న మేనేజర్ను టోర్నమెంట్ల సమయంలో మహిళా జట్టుతో పాటే కొనసాగించారు.
ఈ మొత్తం వ్యవహారంపై ఎమ్సీఏ అధ్యక్షుడు జేమ్స్ కె.సంగ్మా తీవ్రంగా స్పందించారు. అసోసియేషన్లోని కొందరు పదాధికారులు ఈ సమస్యను తొక్కిపెట్టే ప్రయత్నం చేశారని ఆయన బహిరంగంగానే ఆరోపించారు. ఆటగాళ్ల క్షేమం కంటే కూడా తమ తప్పులను కప్పిపుచ్చుకోవడానికే కొందరు ప్రాధాన్యత ఇచ్చారని మండిపడ్డారు. ఇది పరిపాలనాపరంగా జరిగిన ఒక పెద్ద వైఫల్యమని ఆయన అన్నారు. దీనివల్ల క్రీడా ప్రపంచంలో నమ్మకం దెబ్బతిందని ఆవేదన వ్యక్తం చేశారు.
మరోవైపు, ఈ ఘటనపై స్పందించడానికి దేవాజిత్ సైకియా నిరాకరించారు. ఈ విషయానికి సంబంధించిన పూర్తి నిజాలు వెల్లడయ్యే వరకు తాను ఎలాంటి వ్యాఖ్యలు చేయనని ఆయన స్పష్టం చేశారు. ఈ వివాదం ఇప్పుడు కేవలం ఒక జట్టుకో లేదా ఒక అసోసియేషన్కో పరిమితం కాలేదు. భారత క్రీడారంగంలో మహిళా అథ్లెట్ల రక్షణకు ఇదొక పెద్ద పరీక్షగా మారింది. ప్రస్తుతానికైతే అందరి దృష్టి రాష్ట్ర మహిళా కమిషన్ విచారణపైనే ఉంది.

