కలం, ఖమ్మం బ్యూరో: మాదకద్రవ్యాల విక్రయాలు, అక్రమ రవాణాపై ఎక్సైజ్ శాఖ కఠిన చర్యలు కొనసాగిస్తోంది. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల పరిధిలో వివిధ కేసులలో స్వాధీనం చేసుకున్న సుమారు రూ.3.50 కోట్ల విలువైన 696.1 కిలోల గంజాయిని గురువారం అధికారులు దహనం చేశారు. ఖమ్మం (Khammam) ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ సోమిరెడ్డి ఆదేశాల మేరకు ఈ భారీ దహన కార్యక్రమాన్ని నిర్వహించారు. నాలుగు ఎక్సైజ్ స్టేషన్ల పరిధిలో నమోదైన 32 వేర్వేరు కేసులలో పట్టుబడిన గంజాయిని నిబంధనల ప్రకారం అధికారులు కాల్చివేశారు.
వివరాల ప్రకారం.. భద్రాచలం ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో అత్యధికంగా 329.51 కిలోల గంజాయి స్వాధీనం చేసుకోగా, కొత్తగూడెం ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో 316.07 కిలోలు, పాల్వంచ ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో 43.62 కిలోలు, మణుగూరు ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో 6.90 కిలోల గంజాయిని అధికారులు జప్తు చేశారు. స్వాధీనం చేసుకున్న గంజాయిని ప్రభుత్వ అనుమతి పొందిన తల్లాడ మండలం గోపాల్పేట్లోని ఏడబ్ల్యూఎస్ ఇన్సినిరేషన్ పరిశ్రమలో అధికారుల సమక్షంలో శాస్త్రీయ పద్ధతిలో దహనం చేసి బూడిద చేశారు. ఈ కార్యక్రమంలో ఎక్సైజ్ సూపరింటెండెంట్ శ్రీనివాసరెడ్డి, వివిధ ఎక్సైజ్ స్టేషన్ల సీఐలు, సిబ్బంది పాల్గొన్నారు. మాదకద్రవ్యాల అక్రమ రవాణాను అరికట్టేందుకు కఠిన చర్యలు కొనసాగుతాయని అధికారులు తెలిపారు.
Also Read : భారత్కు మరో మైలురాయి.. అగ్ని-4 బాలిస్టిక్ క్షిపణి పరీక్ష సక్సెస్
Follow Us On: Sharechat

