కలం, వెబ్ డెస్క్: ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh)లోని ఫతేపూర్ జిల్లాలో పెళ్లికూతురు పెంపుడు కుక్క విషయంలో జరిగిన గొడవ కారణంగా పెళ్లి రద్దయింది. కుక్కపై జరిగిన దాడి రెండు కుటుంబాల మధ్య హింసాత్మక ఘర్షణకు దారితీయడంతో ఐదుగురు గాయపడ్డారు. వివరాల్లోకి వెళ్తే.. పెళ్లి వేడుకలు జరుగుతున్న సమయంలో కుక్క మొరగడం ప్రారంభించింది. ఇది నచ్చని వరుడి తరపు బంధువు ఒకరు కుక్కను కొట్టాడు. దీంతో వధువు తరపువారు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేయడంతో ఇరువర్గాల మధ్య మాటా మాటా పెరిగి పెద్ద గొడవకు దారితీసింది. ఆవేశంతో కర్రలతో దాడి చేసుకోవడంతో ఐదుగురికి గాయాలయ్యాయి.
సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని ఇరువర్గాలను పోలీస్ స్టేషన్కు తరలించారు. అనంతరం ఇరు కుటుంబాల మధ్య రాజీ కుదిర్చేందుకు ప్రయత్నించినప్పటికీ, తన పెంపుడు జంతువు పట్ల ప్రవర్తించిన వారి ఇంట్లోకి కోడలిగా వెళ్లలేనని వధువు తెగేసి చెప్పింది. దీంతో ఇరు పక్షాల వారు పరస్పర అంగీకారంతో వివాహాన్ని రద్దు చేసుకున్నారు. పెళ్లి (Marriage) కోసం ఇచ్చుకున్న కానుకలు, నగదును కూడా ఒకరికొకరు తిరిగి ఇచ్చేసుకున్నారని పోలీసులు తెలిపారు.


