కలం, ఖమ్మం బ్యూరో: ఆత్మహత్యాయత్నాన్ని అడ్డుకుందని భార్యపై పెట్రోల్ పోసి నిప్పంటించిన ఘటన ఖమ్మం (Khammam) జిల్లా తిరుమలాయపాలెంలో చోటు చేసుకుంది. గురువారం అర్ధరాత్రి జరిగిన ఈ ఘటన స్థానికంగా చర్చనీయంశమైంది. తిరుమలాయపాలెం(Thirumalayapalem) మండల కేంద్రానికి చెందిన నాగభూషణం(65) అనే వ్యక్తి, రెండు సంవత్సరాల నుండి కిడ్నీ వ్యాధితో బాధ పడుతున్నాడు. బాధ భరించలేక పలుమార్లు ఆత్మహత్యాయత్నానికి కూడా ప్రయత్నించాడు. అయితే భార్య జయమ్మ అడ్డుపడుతుండటంతో ఆగిపోయేవాడు.
గురువారం అర్ధరాత్రి కిడ్నీ సమస్య ఎక్కువ అవ్వడంతో తట్టుకోలేకపోయాడు. పురుగుల మందు తాగే ప్రయత్నంలో అడ్డుపడ్డ భార్యపై పెట్రోల్ (Petrol) పోసి నిప్పంటించాడు. అనంతరం భర్త కూడా పురుగుల మందు తాగాడు. మంటలు వ్యాపించడంతో స్థానికులు ఇద్దరినీ ఖమ్మం (Khammam) ప్రభుత్వ హాస్పిటల్లో చేర్చారు. నాగభూషణం శుక్రవారం తెల్లవారు జామున మృతి చెందగా.. జయమ్మ ప్రస్తుతం ప్రాణాపాయ స్థితిలో చికిత్స పొందుతుంది. నాగభూషణం కొడుకు వెంకటేశ్వర్లు ఇచ్చిన ఫిర్యాదు మేరకు తిరుమలాయపాలెం ఎస్ఐ జగదీష్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

