కలం, వెబ్ డెస్క్: ‘హైదరాబాద్ సుందరమైన నగరం. హైదరాబాద్ కంటే సుందరమైన నగరం దేశంలోనే లేదు. ప్రపంచంలోనే గొప్ప నగరంగా హైదరాబాద్ను తీర్చి దిద్దుతాం’ సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) అన్నారు. శుక్రవారం హైదరాబాద్ శివారులో ఎకోహిల్ పార్క్ (Eco Hill Park)ను సీఎం ప్రారంభించి మాట్లాడారు. సినిమా షూటింగ్స్ కోసం విదేశాలకు పోతున్నారని, మంచి ప్రభుత్వం ఉంటే ప్రపంచస్థాయి నగరంగా హైదరాబాద్ను అభివృద్ధి చేసుకోవచ్చు సీఎం అభిప్రాయపడ్డారు.
‘‘ఏం చేసినా కేటీఆర్ అడ్డు పడుతున్నాడు. హైదరాబాద్లో మూసీ రివర్ ప్రంట్ ఏర్పాటు చేస్తాం. మూసీ పక్కన నైట్ ఎకనామిని ఏర్పాటు చేసి ఉపాధి కల్పిస్తాం. ఆయా నియోజకవర్గంలోనే ప్రభుత్వ స్థలాలను చేసి ఇందిరమ్మ ఇళ్లు నిర్మిస్తాం. చంద్రబాబు, వైఎస్ సమయంలో నగరానికి కృష్ణా, గోదావరి నీళ్లు నగరానికి తీసుకువచ్చారు. నాటి నిజాం నవాబు ఇంజనీర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్యతో వరదల నివారణకు మూసీ పైన నిర్మాణాలు చేపట్టారు. వికారాబాద్లో నిజాం నవాబు మెడిసిన్ ప్లాంట్లు నాటారు. ఉస్మానియా హాస్పిటల్, గోల్కొండ, అసెంబ్లీ లాంటి చారిత్రాత్మక కట్టడాలు హైదరాబాద్లో ఉన్నాయి. అలాంటి హైదరాబాద్ ఆక్రమణలు, చెత్తతో నిండిపోయింది. నగరాన్ని మంచిగా చేస్తానంటే ఒప్పుకోవడం లేదు’’ అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.
‘‘నగరాన్ని మంచిగా చేసుకోవడానికి మన ప్రజా ప్రతినిధులను విదేశాలకు పంపాం. విమానాశ్రయం కట్టే సమయంలో కొంత వ్యతిరేకత వచ్చింది.. కానీ ఇప్పుడు పెద్ద ఆస్తిగా మారింది. మూసి మురికిలో బతకాలని ఎవరు అనుకోరు’’ అని సీఎం రేవంత్ అన్నారు.
‘‘శంషాబాద్ బుల్లెట్ ట్రైన్ హబ్గా మారబోతుంది. బెంగళూరు,అమరావతి, చెన్నైకి ఇక్కడి నుంచే బుల్లెట్ ట్రైన్ సౌకర్యం రాబోతుంది. కొత్త ప్రాజెక్టులు వచ్చినప్పుడు కొందరికి ఇబ్బంది ఉంటుంది. వాళ్ళను అనాథలను చేయం. భూమి,ఇల్లు కోల్పోతున్న వారిని ఆదుకుంటాం. నిర్వాసితులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తాం. ప్రపంచం లోనే గొప్ప నగరం గా తీర్చి దిద్దుతాం. ట్రంప్, ఎలాన్ మాస్క్ లాంటి వాళ్ల సంస్థలు ఇక్కడికి రాబోతున్నాయి. ప్రపంచంతో పోటీపడేలా నగరాన్ని అభివృద్ధి చేస్తాం’’ అని ముఖ్యమంత్రి వెల్లడించారు.

