కలం, వెబ్ డెస్క్: మహబూబాబాద్ (Mahabubabad) జిల్లాలో విషాదకర చోటు చేసుకుంది. ఇంట్లో పండుగ చేసుకొని కుటుంబసభ్యులతో సంతోషంగా భోజనం చేస్తున్న వృద్ధుడు మటన్ ముక్క (Mutton Piece) గొంతులో ఇరుక్కొని ఊపిరాడక మృతి చెందాడు. దామరవంచ శివారులోని పిల్లిగుండ్ల తండాలో ఈ ఘటన జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. తండాకు చెందిన బానోతు బిచ్చా (54) ఇంట్లో ఓ సాంప్రదాయ పండుగ చేసుకున్నారు. ఈ సందర్భంగా మటన్ వండుకున్నారు. ఇంట్లో వాళ్లతో కలిసి బానోతు బిచ్చా భోజనానికి కూర్చున్నాడు. అన్నం తింటున్న సమయంలో ఓ మటన్ ముక్క బిచ్చా గొంతులో ఇరుక్కుపోయింది. దీంతో ఆయన ఊపిరాడక ఇబ్బంది పడ్డాడు. కుటుంబ సభ్యులు వెంటనే బిచ్చాను సమీపంలోని ఆసుపత్రికి తీసుకెళ్లారు. కానీ.. అప్పటికే బిచ్చా మృతి చెందాడని వైద్యులు నిర్ధారించారు. బిచ్చా మృతితో పిల్లిగుండ్ల తండాలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఒక్క మటన్ ముక్క వ్యక్తి ప్రాణం తీసిందన్న విషయం సోషల్ మీడియాలో వైరల్గా మారింది.

