కలం, వెబ్ డెస్క్ : పెన్షన్ డబ్బుల కోసం ఆశపడిన ఓ కూతురు, కొడుకు కన్నతండ్రినే హత్య చేశారు. ఈ కేసులో మృతుడి కూతురు, కొడుకుకు మరణ శిక్ష విధిస్తూ మల్కాజిగిరి (Malkajgiri ) జిల్లా కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. అలాగే, హత్యకు సహకరించిన తల్లికి జీవిత ఖైదు విధిస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. కేసు వివరాలు ఇలా ఉన్నాయి.. హైదరాబాద్ లోని మౌలాలిలో రిటైర్డ్ రైల్వే ఉద్యోగి మారుతి సుతార్ (70)ను 2019 ఆగస్టు 16న కొడుకు కిషన్, కూతురు ప్రపుల్ల హత్య చేశారు. తండ్రికి వచ్చే పెన్షన్ తో పాటు బ్యాంకులో ఉన్న డబ్బుపై కన్నేశారు.
ఈ క్రమంలో అన్నంలో ఉమ్మెత్త పువ్వులు, కాయల పొడి కలిపి తినిపించారు. అనంతరం అపస్మారక స్థితిలోకి వెళ్లిన మారుతి సుతార్ శరీరాన్ని కొడుకు, కూతురు ముక్కలుగా నరికారు. శరీర భాగాలను పడేయడానికి తల్లి గంగాబాయి సహకరించారు. అయితే, పక్కింట్లో శుభకార్యం ఉండడంతో రెండు రోజుల పాటు శరీర భాగాలను ఇంట్లోనే ఉంచారు. దీంతో దుర్వాసన రావడంతో అసలు విషయం బయటపడింది. కేసు విచారణలో నిందితులుగా తేలడంతో మృతుడి కూతురు, కొడుకు, సహకరించిన భార్యకు శిక్ష విధిస్తూ మల్కాజిగిరి కోర్టు తీర్పు వెల్లడించింది.

