కలం, మహబూబ్ నగర్ బ్యూరో : యువత తాత్కాలిక ఆనందం కోసం మాదక ద్రవ్యాల వైపు వెళ్లి.. బంగారు భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని మహబూబ్నగర్ జిల్లా ఎస్పీ డీ.జానకి (SP Janaki) సూచించారు. అంతర్జాతీయ మాదకద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం సందర్భంగా శుక్రవారం జడ్చర్లలో భారీ వాకథాన్ నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణంలోని మినీ స్టేడియం, బీఆర్ఆర్ డిగ్రీ కళాశాల గ్రౌండ్స్లో జడ్చర్ల పోలీసుల ఆధ్వర్యంలో భారీ అవగాహన వాకథాన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సుమారు 1500 మంది విద్యార్థులు, వాకర్స్, యువత, మహిళలు, అధికారులు ప్రజలు పాల్గొన్నారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎస్పీ డీ.జానకి హాజరై సభను ఉద్దేశించి ప్రసంగించారు. మాదకద్రవ్యాలు యువత భవిష్యత్తును నాశనం చేసే ప్రమాదకరమైన సామాజిక దుష్ప్రవర్తన అని ఆమె (SP Janaki) తెలిపారు. తాత్కాలిక ఆనందం కోసం డ్రగ్స్ వైపు మళ్లే యువత తమ జీవితాలను, కుటుంబాల ఆశలను, సమాజ భవిష్యత్తును ప్రమాదంలోకి నెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థులు మాదకద్రవ్యాల బారిన పడకుండా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, సమాజంలోని ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని తెలిపారు. నేటి విద్యార్థులే రేపటి భావి భారత పౌరులని, వారి భవిష్యత్తు సురక్షితంగా ఉండేలా అందరూ బాధ్యతతో వ్యవహరించాలని సూచించారు. మహబూబ్నగర్ జిల్లాను పూర్తిగా డ్రగ్-ఫ్రీ జిల్లాగా తీర్చిదిద్దడం పోలీసు శాఖ లక్ష్యమని, ఈ లక్ష్య సాధనలో విద్యార్థులు, యువత, తల్లిదండ్రులు, స్వచ్ఛంద సంస్థలు, ప్రజలందరి సహకారం అత్యంత అవసరమని ఎస్పీ పిలుపునిచ్చారు.
అనంతరం మాదకద్రవ్యాల నిర్మూలనకు సంబంధించిన అవగాహన పోస్టర్లను ప్రదర్శించారు. మినీ స్టేడియం నుంచి నేతాజీ చౌరస్తా వరకు భారీ వాకథాన్ ర్యాలీ చేపట్టారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్, డీఎస్పీ వెంకటేశ్వర్లు, జడ్చర్ల టౌన్ ఇన్స్పెక్టర్ కమలాకర్, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్, మహిళా పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ కృష్ణ, సీసీఎస్ ఇన్స్పెక్టర్ నాగార్జున గౌడ్, ఇతర పోలీసు అధికారులు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.

