కలం, మహబూబ్ నగర్ బ్యూరో : జాతీయ రహదారిపై ప్రమాదాలు జరగకుండా ఉండాలంటే పరిశుభ్రత ఎంతో ముఖ్యమని మహబూబ్ నగర్ (Mahabubnagar) అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్ అన్నారు. జడ్చర్ల మున్సిపాలిటీ పరిధిలో జాతీయ రహదారి వెంట చేపడుతున్న పరిశుభ్రత పనులను ఆయన మంగళవారం పరిశీలించారు. జాతీయ రహదారి వెంట కొనసాగుతున్న శుభ్రత పనులతో పాటు రహదారి మధ్య మీడియన్ లో మొక్కల పెంపకం, బారికేడింగ్, గడ్డి, పిచ్చిమొక్కల తొలగింపు, పరిసరాల పరిశుభ్రతకు సంబంధించిన పనులను పరిశీలించారు.
అనంతరం పనుల పురోగతిని సంబంధిత అధికారులతో సమీక్షించారు. జాతీయ రహదారి పరిసరాలు పరిశుభ్రంగా, సుందరంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ప్రస్తుతం కొనసాగుతున్న పనులను మరింత వేగవంతం చేయాలని ఆదేశించారు. జాతీయ రహదారి వెంట గుర్తించిన శుభ్రత పనులు, మొక్కలు నాటడం, బారికేడింగ్, గడ్డి తొలగింపు తదితర అన్ని పనులను రెండు రోజుల్లోగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులను అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్ ఆదేశించారు.

