కలం వెబ్ డెస్క్: జంతువులను అతిగా ప్రేమించడం, అవి చనిపోవడం తట్టుకోలేక యువతులు తీవ్ర మనస్తాపానికి గురై ఆత్మహత్యలు (Two girls commit suicide) చేసుకుంటున్న ఘటనలు హైదరాబాద్ లో చోటుచేసున్నాయి. ఇటీవలే ఇద్దరు విద్యార్థినులు ప్రాణాలు తీసుకోవడం తీవ్రంగా కలిచివేస్తోంది. హైదరాబాద్ లో వేర్వేరుగా జరిగిన ఈ ఘటనలు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. పిల్లి చనిపోయిందని మూడు రోజుల క్రితం మీర్ పేటకు చెందిన ఓ యువతి ఆత్మహత్య చేసుకుంది. ఆ ఘటన మరువక ముందే పిల్లిని ఇంట్లోకి తీసుకురావద్దన్నందుకు అల్వాల్లో నివాసం ఉంటున్న ఎంబీబీఎస్ విద్యార్థిని శ్రేష్ట సూసైడ్ చేసుకొని తనువు చాలించింది. మూగజీవులపై ప్రేమ ఉండటం సహజమైనదేనని, మరీ సెన్సిటివ్ గా ఉండి ఇలా ప్రాణాలు తీసుకోవడం కలచి వేస్తోందని.. తల్లిదండ్రులు పిల్లల పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని మానసిక నిపుణులు సూచిస్తున్నారు.
పూర్తి వివరాల్లోకి వెళ్తే.. నగరంలోని అల్వాల్ చెందిన కుసుమలత, దేవదత్తం దంపతుకు శ్రేష్ట అనే కుమార్తె ఉంది. ఈమె ప్రస్తుతం ఎంబీబీఎస్ చదువుతోంది. ఆయితే ఇంట్లో పెంచుకుంటున్న ఒక పెంపుడు పిల్లి విషయంలో శుక్రవారం తల్లితో శ్రేష్ణ గొడవపడింది. మాటామాటా పెరగటంతో తల్లి మందలించింది. పిల్లిని ఇంట్లోకి తీసుకురావద్దని శ్రేష్టకు తల్లి వర్కింగ్ ఇచ్చింది. పిల్లిపై యెనలేని ప్రేమ పెంచుకున్న శ్రేష్ఠ.. తీవ్ర మనస్తాపానికి గురైన ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. బయటకు వెళ్లి ఇంటికొచ్చిన తల్లిదండ్రులకు శ్రేష్ఠ ఫ్యాన్కు వేలాడుతూ విగతజీవిలా కనిపించింది. దీంతో ఒక్కసారిగా షాక్ కు గురైన పేరెంట్స్.. తమ కూతురు చనిపోవడాన్ని భరించలేకపోయారు. ‘అమ్మా.. శ్రేష్ఠ ఎంతపని చేశావమ్మా’ అంటూ కన్నీరుమున్నీరుగా విలపించారు. పీజీ పరీక్షలకు సిద్ధమవుతూ తన భవిష్యత్తు కు బాటలు వేసుకుంటున్న అమ్మాయి సడన్గా ఇలా చిన్న గొడవకి సూసైడ్ చేసుకోవడంతో ఆ కుటుంబం దుఃఖ సాగరంలో మునిగిపోయింది.
ఈ ఘటన జరగడానికి మూడు రోజుల క్రితం మీర్పేటలో ఇలాంటి ఘటనే మరొకటి జరిగింది. పిల్లి మరణం తట్టుకోలేక యువతి ఆత్మహత్య చేసుకుంది. తాను ఇష్టంగా పెంచుకుంటున్న పిల్లి మరణం తట్టుకోలేక పురుగుల మందుతాగి హిమబిందు అనే యువతి సూసైడ్ చేసుకుంది. మీర్పేట్లో పేరెంట్స్తో పాటు నివసిస్తున్న హిమబిందు గత రెండేళ్లుగా ఒక పిల్లిని పెంచుకుంటుంది. ఈ క్రమంలోనే అది మరణించింది. ఇంట్లో వాళ్ళకంటే ఎక్కువగా ప్రేమతో పెంచుకున్న పిల్లి మరణించడంతో.. హిమబిందు తీవ్ర మనస్తాపానికి గురైంది. దీంతో పిల్లి లేని లేకంతో తానూ ఉండలేనని భావించి పురుగుల మందు తాగి హిమబిందు ఆత్మహత్యకు ప్రయత్నించింది. ఇది గమనించిన కుటుంబసభ్యులు వెంటనే ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆమె చనిపోయినట్టు వైద్యలు నిర్దారించారు. దీంతో ఆ కుటుంబంలో చీకటి అలుముకుంది.

