రేపు సిద్దిపేటలో సీఎం పర్యటన: ఏర్పాట్లు పూర్తి

కలం, మెదక్ బ్యూరో: సిద్దిపేట జిల్లాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) రేపటి పర్యటన నేపథ్యంలో అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తోంది. ఆదివారం సాయంత్రం ముఖ్యమంత్రి జిల్లాకు చేరుకోనున్నారు. నంగునూరు మండలం నర్మేట గ్రామంలో నూతనంగా నిర్మించిన ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీని ముఖ్యమంత్రి ప్రారంభించనున్నారు. ఫ్యాక్టరీని ప్రారంభించిన అనంతరం ఆయన అక్కడ పైలాన్‌ను ఆవిష్కరిస్తారు. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలోనే మొట్టమొదటి ఆయిల్ రిఫైనరీకి ఆయన శంకుస్థాపన చేయనున్నారు.

ఈ సందర్భంగా గత మూడు రోజులుగా ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ ప్రాంగణంలో నిర్వహిస్తున్న రైతు మహోత్సవంలో భాగంగా ఏర్పాటు చేసిన వివిధ స్టాళ్లను సీఎం సందర్శిస్తారు. అనంతరం నిర్వహించే భారీ రైతు బహిరంగ సభలో ఆయన పాల్గొంటారు. తెలంగాణ ప్రజలు ఎంతో కాలంగా ఆసక్తిగా ఎదురుచూస్తున్న రైతు భరోసా నిధులను ఈ సభ వేదిక నుండే ముఖ్యమంత్రి రేవంత్​ రెడ్డి (Revanth Reddy) విడుదల చేయనున్నారు.

ముఖ్యమంత్రి పర్యటనను విజయవంతం చేసేందుకు రాష్ట్ర మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్, వివేక్ వెంకటస్వామి నిరంతరం పర్యవేక్షణ చేస్తున్నారు. జిల్లా కలెక్టర్, పోలీస్ కమిషనర్, ఇతర శాఖల అధికారులతో వారు ఇప్పటికే పలుమార్లు సమీక్షా సమావేశాలు నిర్వహించారు. బహిరంగ సభకు సుమారు 600 బస్సుల ద్వారా దాదాపు 30 వేల మంది ప్రజలు హాజరయ్యే అవకాశం ఉన్నందున, వారికి అవసరమైన తాగునీరు, తాత్కాలిక మరుగుదొడ్లు, పార్కింగ్ సౌకర్యాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు. ఎక్కడా ఎటువంటి అసౌకర్యం కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు.

హెలికాప్టర్ ద్వారా పర్యటనకు రానున్న సీఎం కోసం హెలిప్యాడ్ వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. హెలిప్యాడ్ నుండి సభాస్థలి వరకు ముఖ్యమంత్రి కాన్వాయ్, ఫ్యాక్టరీ ప్రారంభోత్సవం, శిలాఫలకాల ఆవిష్కరణ వంటి కార్యక్రమాల కోసం ప్రణాళికాబద్ధంగా ఏర్పాట్లు పూర్తయ్యాయి. వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని మంత్రులు సూచించారు. ముఖ్యంగా భద్రత, ట్రాఫిక్ నియంత్రణ, విద్యుత్ సరఫరా, సౌండ్ సిస్టమ్, ఫైర్ ఇంజన్లు, అంబులెన్స్, మెడికల్ క్యాంపుల నిర్వహణపై అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>