కలం, కరీంనగర్ బ్యూరో : ఎల్ఐసి లోని కార్మిక సంఘం ఆలిండియా ఇన్సూరెన్స్ ఎంప్లాయిస్ అసోసియేషన్ 76వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా డిమాండ్లకు పరిష్కారం కోసం కరీంనగర్ డివిజన్ ఆఫీస్ చౌరస్తాలో మానవహారం చేసి నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో కరీంనగర్ డివిజన్ ఆఫీస్ బ్రాంచ్ 1, 2 లోని అన్ని తరగతుల ఉద్యోగులు (LIC Employees) పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కరీంనగర్ ఎల్ఐసి సీనియర్ డివిజనల్ మేనేజర్ శివనాగ ప్రసాద్ మాట్లాడుతూ.. బలమైన ఎల్ఐసి, బలమైన భారతదేశ నిర్మాణం కోసం AIIEA చేపట్టిన మానవహారాన్ని అభినందించారు. 1956 నుంచి ఎల్ఐసి అంచెలంచలుగా ఎదుగుతూ భారతదేశ ఆర్థిక స్వావలంబనకు తన వంతు కృషి చేసిందని, ఇందులో ఎల్ఐసి ఉద్యోగులు ఏజెంట్లు మార్కెటింగ్ సిబ్బంది కృషి శ్లాఘనీయమని వివరించారు.
పోటీ మార్కెట్లో సైతం ఎల్ఐసి చక్కటి ప్రదర్శన కొనసాగిస్తున్నదన్నారు. ఇదే ప్రదర్శన కొనసాగించేందుకు ఎల్ఐసి ఉద్యోగులంతా మరింత కృషి కొనసాగించాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఐసీఈయూ అధ్యక్షుడు రామ్మోహన్ రావు మాట్లాడుతూ.. వజ్రోత్సవ వేడుక ముగింపు భాగంగా బలమైన భారతదేశం కోసం బలమైన ఎల్ఐసి అనే నినాదంతో ఆల్ ఇండియా ఇన్సూరెన్స్ ఎంప్లాయిస్ అసోసియేషన్ అన్ని కార్యాలయాలలో మానవహారం చేయాలని నిర్ణయం తీసుకుందని వివరించారు. 100 శాతం ఎఫ్డిఐ అనుమతించిన తర్వాత విదేశీ కంపెనీలు బీమా లైసెన్సుల కోసం క్యూలు కడుతున్నారని ఐఆర్డిఏ వ్యాఖ్యానించడం విచారకరమన్నారు. అలాగే చక్కటి సేవలను అందించడానికి తక్షణమే ఎల్ఐసిలో క్లాస్-3, క్లాస్ -4 క్యాడర్లలో నియామకాలను వెంటనే చేపట్టాలని డిమాండ్ చేశారు.

