కలం, వెబ్ డెస్క్: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమంలో భాగంగా సిరిసిల్ల విద్యార్థులకు ట్యాబ్లు పంపిణీ చేశారు. సిరిసిల్ల నియోజకవర్గంలో టెన్త్ వార్షిక పరీక్షల్లో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన మొదటి 30 మంది విద్యార్థులకు సిరిసిల్ల పట్టణంలోని గీతానగర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ట్యాబ్లను పంపిణీ చేసి అభినందించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. విద్యార్థులకు ఈ ప్రోత్సాహకాలు మరింత ఉన్నత లక్ష్యాలను సాధించేందుకు స్ఫూర్తినిస్తాయని చెప్పారు. నేటి డిజిటల్ యుగంలో టెక్నికల్ నాలెడ్జ్ విద్యార్థులకు ఎంతో అవసరమని అన్నారు. ట్యాబ్లను విద్యాభివృద్ధికి వినియోగించుకొని భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని సూచించారు. సిరిసిల్ల విద్యార్థులు రాష్ట్ర స్థాయిలోనే కాకుండా జాతీయ, అంతర్జాతీయ స్థాయిల్లోనూ రాణించే సామర్థ్యం కలిగి ఉన్నారని కొనియాడారు. ప్రతిభను ప్రోత్సహించడం ద్వారా సమాజ అభివృద్ధికి బాటలు వేయవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు.

