కలం, వరంగల్ బ్యూరో: రాష్ట్ర రాజకీయాల్లో ఉమ్మడి వరంగల్ (Warangal) జిల్లాకు చెందిన ఇద్దరు కీలక నేతల పరిణామాలు మరోసారి హాట్ టాపిక్గా మారాయి. బీఆర్ఎస్ హయాంలో డిప్యూటీ సీఎం తాటికొండ రాజయ్య (Thatikonda rajaiah) ను సీఎం కేసీఆర్ కేబినెట్ నుంచి బర్తరఫ్ చేశారు. ప్రస్తుత కాంగ్రెస్ పాలనలో మంత్రి కొండా సురేఖ (Konda Surekha) ను సీఎం రేవంత్రెడ్డి కేబినెట్ నుంచి తప్పించడం రాజకీయంగా చర్చకు దారితీసింది.
పార్టీ అధిష్టానం, ప్రభుత్వ నాయకత్వంతో ఏర్పడిన విభేదాలు, రాజకీయ పరిణామాల కారణంగా ఇద్దరూ మంత్రి పదవులను కోల్పోవడం యాదృచ్ఛికమే అయినా.. వరంగల్ రాజకీయాల్లో రెండు ఘటనలను పోల్చుతూ తీవ్ర చర్చ జరుగుతోంది. తాటికొండ రాజయ్య రాష్ట్రం ఏర్పడిన తొలినాళ్లలో టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రిగా, వైద్య ఆరోగ్యశాఖ మంత్రిగా పనిచేశారు. స్టేషన్ఘన్పూర్ నుంచి ప్రాతినిథ్యం వహించిన ఆయనకు పార్టీలోనూ అప్పట్లో కీలక స్థానం ఉండేది. రాజయ్యపై పలు ఆరోపణలు రావడంతో 2015లో ఆయనను కేసీఆర్ మంత్రివర్గం నుంచి తప్పించారు.
ఆ పరిణామం ఉమ్మడి జిల్లా రాజకీయాల్లో అప్పట్లో సంచలన మైంది. మంత్రి పదవి పోయినప్పటికీ రాజయ్య రాజకీయాల్లో తన ఉనికిని కొనసాగించే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత ఇప్పుడు ఉమ్మడి జిల్లాకు చెందిన మరో మంత్రి కొండా సురేఖ విషయంలోనూ ఇలాంటి పరిణామం చోటుచేసుకోవడం రాజకీయ వర్గాల్లో విస్తృత చర్చకు పెట్టింది. కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న సురేఖ.. తాజా వివాదాలు, పార్టీ అంతర్గత పరిణామాల నేపథ్యంలో అధిష్టానం నిర్ణయంతో మంత్రి పదవిని కోల్పోయే పరిస్థితి తెచ్చుకున్నారు. మంత్రి పదవి పోయిన తర్వాత కొండా సురేఖ రాజకీయంగా ఏం చేస్తారు?.. అనే ప్రశ్న ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

