కలం, కరీంనగర్ బ్యూరో: కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ ను ప్రజలు ఆనాడు బీఆర్ఎస్ కు అప్పగిస్తే కొందరు కార్పొరేటర్లు స్వయంగా కబ్జాలకు పాల్పడ్డారని, ఈనాడు బీజేపీ కి అప్పగిస్తే దాడులకు పాల్పడుతున్నారని సుడా మాజీ చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి (Komatireddy Narender Reddy) మండిపడ్డారు. స్థానిక ముఖరంపురలోని ఆయన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ కార్పొరేటర్లు భూకబ్జాలకు పాల్పడ్డారని, మొన్న జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ నాయకులు అనేక మాయ మాటలు చెప్పి ఓట్లు వేయించుకున్నారని, ఇప్పుడు కొందరు బీజేపీ కార్పొరేటర్లు దాడులకు దిగుతున్నారని కాంగ్రెస్ ప్రభుత్వం ఇటువంటి వాటిని సహించదని, ప్రశాంత కరీంనగర్ ప్రజలను పరేషాన్ చేస్తామంటే చూస్తూ ఊరుకోదని నరేందర్ రెడ్డి హెచ్చరించారు.
బాధ్యతగల పదవిలో ఉన్న బండి సంజయ్ కుమార్ జరుగుతున్న దాడులపై ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఏ పార్టీకి చెందిన వారైనా స్థానిక ఎమ్మెల్యే అధికారిక క్యాంపు కార్యాలయం పై స్వయంగా బీజేపీ కార్పొరేటర్లు దాడికి దిగారని, ఢిల్లీలో విద్యార్థులపై, యువకులపై బాష్పవాయువు, లాఠీ చార్జి, పెల్లెట్ గన్స్ తో దాడి జరిగితే కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి ఆఫీసు ముందు శాంతియుతంగా నిరసన చేద్దామని కాంగ్రెస్ నాయకులం వెళ్తే ఒక బీజేపీ కార్పొరేటర్ కర్రలతో దాడికి దిగాడని, ఈ రోజు కిసాన్ నగర్ లో ఇంకొక బీజేపీ కార్పొరేటర్ కు సంబంధించిన వ్యక్తులు ఏకంగా కత్తులతో, బీరు సీసాలతో దాడులకు పాల్పడ్డారని, ఇటువంటి సంస్కృతి మంచిది కాదని నరేందర్ రెడ్డి అన్నారు.
పోలీసులు వెంటనే స్పందించి నిందితులను అరెస్ట్ చేశారని, ప్రజలు భయభ్రాంతులకు గురికావాల్సిన అవసరం లేదని, ఇటువంటివి పునరావృతం కాకుండా రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని నరేందర్ రెడ్డి పేర్కొన్నారు. ఈ విలేకరుల సమావేశంలో మైనారిటీ సెల్ అధ్యక్షుడు ఎండి తాజ్, కార్పొరేటర్లు వారాల నర్సింగం, పర్వతం మల్లేశం, కాంతాల జగన్ రెడ్డి, గుండాటి శ్రీనివాస్ రెడ్డి, లయిక్, దండి రవీందర్, కుర్ర పోచయ్య, ముక్క భాస్కర్, జీడి రమేష్, ఎండి చాంద్, షబానా మహమ్మద్, తోట అంజయ్య, గుడిపాటి రమణారెడ్డి, బషీర్, భారీ, బత్తుల రాజ్ కుమార్, ఖలీల్, మేకల నర్సయ్య, జాఫర్, ఇమామ్ పాల్గొన్నారు.

