కలం, వెబ్ డెస్క్: రానున్న రోజుల్లో వైఎస్ జగన్ (YS Jagan) ఏపీలో టీడీపీకి రాజకీయ సమాధి కట్టడం ఖాయమని మాజీ మంత్రి కొడాలి నాని (Kodali Nani) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా వైసీపీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వెన్నుపోటుకు రెండేళ్లు కార్యక్రమంలో నాని పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్లపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తయ్యిందని, ఈ రెండేళ్లలో సూపర్ సిక్స్ హామీల్లో ఎన్ని హామీలు నెరవేర్చారని ప్రశ్నించారు. 18 సంవత్సరాలు నిండిన ప్రతి మహిళకు నెలకు రూ.1500 ఇస్తామని చెప్పారని, ఏడాదికి రూ.18,000 చొప్పున ఇప్పటి వరకు మొత్తం ప్రతి మహిళకు రూ.36,000 బాకీ ఉన్నారని చెప్పారు.
ఇక 25 లక్షల నుంచి 30 లక్షల వరకు ఉన్న నిరుద్యోగులకు రూ.3000 నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పారని, ఇలా ఒక్కొక్కరికీ రూ.72 వేల రూపాయలు బాకీ పడ్డారన్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే చంద్రబాబు మెగా డీఎస్సీ పెడతామని చెప్పి, ఉద్యోగాలు అమ్ముకున్నారని ఆరోపించారు. ఉద్యోగాలు రావాల్సిన వాళ్లకు అన్యాయం చేసి వారి పొట్ట కొట్టారన్నారు. సీఎం చంద్రబాబు (Chandrababu) సంపద సృష్టిస్తానని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత చేసిందేం లేదన్నారు. నాడు వైఎస్ జగన్ రూ.3.5 లక్షల కోట్లు అప్పు చేసి రూ.3 లక్షల కోట్లు ప్రజలకే సంక్షేమ కార్యక్రమాల ద్వారా అందించారని నాని గుర్తు చేశారు.
చంద్రబాబు ఇప్పటికే రూ.3 లక్షల దాకా అప్పు చేసి కాంట్రాక్టుల ద్వారా దోచుకుంటున్నారని నాని ఆరోపించారు. చంద్రబాబు జగన్ను, వైసీపీని గొడ్డలి పార్టీ అని విమర్శిస్తున్నారని నాని (Kodali Nani) ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు, లోకేశ్, టీడీపీ, ఎల్లో మీడియాకు వైసీపీ గొడ్డలి పార్టీలాగానే కనిపిస్తుందని నాని వ్యాఖ్యానించారు. గొడ్డలి శివుడు, దుర్గామాత, విఘ్నేశ్వరుడి చేతిలో ఉంటుందని, ఆ గొడ్డలి కోసం తపస్సు చేస్తే పరుశరాముడికి ఇచ్చారని నాని అన్నారు. అదే గొడ్డలి 2029లో జగన్ చేతికి వస్తుందని, రానున్న ఎన్నికల్లో జగన్ ఆ గొడ్డలితోనే టీడీపీ నేతల రాజకీయ జీవితాన్ని శాశ్వతంగా సమాధి చేస్తారని వ్యాఖ్యానించారు.
Read Also: ‘జనసేన 21 సీట్లతో రాజీపడలేదు’.. పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు
Follow Us On: Instagram

