కలం, మహబూబ్ నగర్ బ్యూరో: దేవరకద్ర (Devarkadra) మండలంలోని గురుకొండ గ్రామంలో గురువారం మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (MGNREGS) కింద కొనసాగుతున్న పనులను జిల్లా కలెక్టర్ ఖుష్బూ గుప్తా (Collector Khushboo Gupta) పరిశీలించారు. ఈ సందర్భంగా మొక్కలు నాటేందుకు గుంతలు తవ్వుతున్న ఉపాధి కూలీలతో కలెక్టర్ నేరుగా మాట్లాడి వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. ఒక్కో గుంతను ఎంత లోతుగా తవ్వుతున్నారు, ఒక్కో కార్మికుడు రోజుకు ఎన్ని గుంతలు తవ్వుతున్నారు, వారికి క్రమం తప్పకుండా పని లభిస్తోందా లేదా, అనే విషయాలను వారికి అడిగి తెలుసుకున్నారు.
అలాగే కూలీలకు వేతనాలు సకాలంలో అందుతున్నాయా? అని అడిగి తెలుసుకున్నారు. పని ప్రదేశంలో తాగునీరు, నీడ, ప్రథమ చికిత్స వంటి మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నారా లేదా అనే అంశాలపై కూడా వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఉపాధి హామీ పనులు నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా నిర్వహించడంతో పాటు కార్మికులకు ప్రభుత్వం నిర్దేశించిన అన్ని సౌకర్యాలు తప్పనిసరిగా అందుబాటులో ఉండేలా అధికారులు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో దేవరకద్ర ఎంపీడీవో, తహసీల్దార్తో పాటు సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

