కలం, నిర్మల్: పెంబి మండలంలోని పోచంపల్లి గ్రామంలో రూ.30 లక్షల వ్యయంతో నిర్మించనున్న వ్యవసాయ గోదాం నిర్మాణానికి ఖానాపూర్ ఎమ్మెల్యే (Khanapur MLA) వెడ్మ బొజ్జు పటేల్ (Vedma Bhojju Patel) మంగళవారం భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా గ్రామస్థులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. గ్రామస్థులు తెలిపిన సమస్యలపై ఎమ్మెల్యే అక్కడే సంబంధిత అధికారులతో చర్చించారు. సమస్యలను వెంటనే పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. గ్రామంలో బ్రిడ్జి నిర్మాణానికి సంబంధించి వారం రోజులలో రూ.20 లక్షలతో ప్రొసీడింగ్స్ అందజేస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.
అలాగే గ్రామంలోని అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయించేందుకు కృషి చేస్తామని తెలిపారు. చుట్టుపక్కల గ్రామాలలో నెలకొన్న నెట్వర్క్ సమస్యను పరిష్కరించేందుకు సెల్ టవర్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పెంబి మండలానికి చెందిన వివిధ శాఖల అధికారులు, గ్రామ సర్పంచ్, గ్రామస్థులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

