కలం, ఖమ్మం బ్యూరో: విపత్తుల నిర్వహణపై ప్రజల్లో అవగాహన కల్పించడంతో పాటు జిల్లా యంత్రాంగాన్ని సిద్ధం చేసేందుకు చేపట్టిన ఫ్లడ్ మాక్ ఎక్సర్సైజ్ (Flood Mock Drill) ను విజయ వంతంగా నిర్వహించామని ఖమ్మం (Khammam) జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్ తెలిపారు. జిల్లాలోని మున్నేరు పరివాహక ప్రాంతంలో నిర్వహించిన వరద ప్రమాదాల మాక్ ఎక్సర్సైజ్ ను కలెక్టర్ సోమవారం పరిశీలించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వరదల వంటి విపత్తుల సమయంలో అధికారులు, ప్రజలు సమన్వయంతో పనిచేస్తే ప్రాణనష్టం నివారించవచ్చన్నారు. వివిధ శాఖల అధికారులు సమన్వయంతో విపత్తు సమయంలో చేపట్టాల్సిన చర్యలపై సాధన నిర్వహించి నట్లు వివరించారు. ఈ మాక్ డ్రిల్ ద్వారా వ్యవస్థలో ఉన్న లోపాలను గుర్తించి, భవిష్యత్తులో మరింత సమర్థవంతంగా పనిచేసేలా చర్యలు తీసుకోవచ్చన్నారు.
అంతకుముందు మాక్ ఎక్సర్సైజ్ లో భాగంగ వరదల కారణంగా మున్నేరు పరివాహక ప్రాంతం ముంపుకు గురవుతుందని సమాచారం అందుకున్న జిల్లా కంట్రోల్ రూమ్ సంబంధిత అధికారులను, రెస్క్యూ బృందాలను అప్రమత్తం చేసింది. స్థానికంగా ఉన్న ఆపద మిత్ర వాలంటీర్ల సహకారంతో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించి, రామ్ లీలా ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రానికి చేర్చడం జరిగింది.
వరదల సమయంలో ప్రజలు ముఖ్యమైన పత్రాలు, ఆభరణాలు కోల్పోయే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని, ఆధార్ కార్డు, రేషన్ కార్డు, బ్యాంక్ పాస్బుక్లు, భూ పత్రాలు వంటి ముఖ్యమైన డాక్యుమెంట్లు, విలువైన వస్తువులను వాటర్ ప్రూఫ్ జిప్ బ్యాగ్లలో సిద్ధంగా ఉంచుకోవాలని కలెక్టర్ సూచించారు. అత్యవసర సమయంలో వెంట తీసుకుని వెళ్లేందుకు ప్రతి కుటుంబం ముందస్తు ప్రణాళికతో సిద్ధంగా ఉండాలన్నారు. అనంతరం ఖమ్మం జనరల్ ఆస్పత్రి వద్ద, వరదలలో చిక్కుకున్న వారిని సంరక్షించి వైద్య సేవలు అందించేలా కూడా మాక్ ఎక్సర్సైజ్ చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో మునిసిపల్ కమీషనర్ అభిషేక్ అగస్త్య, ఇతర అధికారులు, వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు.

