కలం, ఖమ్మం బ్యూరో : ఫిబ్రవరి11 తేదీన జరిగే మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఖమ్మం (Khammam) కమిషనరేట్ పరిధిలోని ఆయా మున్సిపాలిటీల పరిధిలో మద్యం విక్రయాలను నిలిపివేయాలని పోలీస్ కమిషనర్ సునీల్ దత్ ఆదేశాలు జారీ చేశారు. ఫిబ్రవరి 9వ తేదీన సాయంత్రం 5:00 గంటల నుండి ఫిబ్రవరి 11న ఎన్నికలు ముగిసే వరకు మద్యం విక్రయాలను నిలిపివేయాలని సూచించారు. అదేవిధంగా ఫిబ్రవరి 13న జరిగే ఓట్ల లెక్కింపు సందర్భంగా ఉదయం 8 గంటల నుండి ఓట్ల లెక్కింపు పూర్తి అయ్యే వరకు ఖమ్మం జిల్లా పరిధిలోని ఏదులాపురం, మధిర, వైరా, సత్తుపల్లి, కల్లూరు మున్సిపాలిటీ కౌంటింగ్ సెంటర్ పరిధిలో వైన్ షాపులు, బార్లు, మద్యం సరఫరా చేసే రెస్టారెంట్లు మూసివేయాలని సీపీ ఆదేశించారు.
ఎన్నికల నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలింగ్ ప్రశాంతంగా జరిగేలా ముందస్తు చర్యలలో భాగంగా బంద్ చేయాలని సూచించారు. నిబంధనలు అతిక్రమించి ఎవరైనా మద్యం దుకాణాలు ఓపెన్ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నిబంధనలు పాటిస్తూ పోలింగ్ ప్రశాంతంగా జరిగేలా సహకరించాలని ఖమ్మం సీపీ (Khammam CP) కోరారు.


