కలం, ఖమ్మం బ్యూరో: ప్రజావాణి ద్వారా అంధ విద్యార్థుల సమస్యలను తెలుసుకొని ఖమ్మం (Khammam) కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి చలించిపోయారు. వెంటనే అంధుల ప్రత్యేక పాఠశాల నిర్మాణానికి నిధులు కేటాయించి, పనులను ప్రారంభించేలా చొరవ తీసుకున్నారు. శుక్రవారం నిజాంపేట్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ఆవరణలో నూతనంగా ఏర్పాటుచేస్తున్న అంధుల పాఠశాల నిర్మాణ పనులను జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. నిర్మాణ పనులను క్షుణ్ణంగా పరిశీలించారు. ప్రహరీ, అంతర్గత గదుల రూపకల్పన, గ్రీనరీ, మొక్కలు, టైల్స్, ప్రత్యేకమైన టాయిలెట్స్, తరగతి గదులు, ఇతర పనులను పరిశీలించారు. పాఠశాల నిర్మాణంలో రాజీపడొద్దని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
పిల్లల (Blind Students) కోసం బ్రెయిలీ లిపి పుస్తకాలు, ఆడియో బుక్స్, లెర్నింగ్ డివైజ్లు తప్పనిసరిగా అందుబాటులో ఉంచాలన్నారు. కంప్యూటర్ స్కిల్స్ కోసం స్మార్ట్ టెక్నాలజీతో ల్యాబ్ ఏర్పాటు చేయాలని తెలిపారు. విద్యార్థులు సాఫ్ట్వేర్ స్క్రీన్ రీడర్లు, డిజిటల్ లెర్నింగ్ మాడ్యూల్స్ ద్వారా పాఠాలు నేర్చుకునేలా వాతావరణం ఉండాలన్నారు. విద్యుత్, ఇతర ఎలాంటి ప్రమాదాలు లేకుండా పాఠశాల నిర్మాణం చేయాలని ఆదేశించారు. తమ పాఠశాలను సందర్శించిన సందర్భంగా అంధ విద్యార్ధిని జి. భవాణి ధన్యవాదాలు తెలుపగా.. కలెక్టర్ భావోద్వేగానికి లోనయ్యారు.

