కలం, ఖమ్మం బ్యూరో : మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు పువ్వాడ అజయ్ కుమార్పై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ దూషిస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని ఖమ్మం నగర బీఆర్ఎస్ (Khammam BRS) యువజన విభాగం ప్రధాన కార్యదర్శి మాటేటి కిరణ్ కుమార్ హెచ్చరించారు. మాజీ మంత్రిపై అసభ్యకర పదజాలంతో విమర్శలు చేసిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్త బోడేపూడి రాజాపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ ఖమ్మం నగర బీఆర్ఎస్ యూత్ నాయకులు మంగళవారం ఖానాపురం హవేలి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఈ సందర్భంగా మాటేటి కిరణ్ కుమార్ మాట్లాడుతూ… స్థాయి మరిచి మాట్లాడటం సబబు కాదని, పెద్ద నాయకులను విమర్శిస్తే హీరో అయిపోతామనే భ్రమలో కొందరు అవాకులు చెవాకులు పేలుతున్నారని మండిపడ్డారు. ఇటువంటి అనుచిత వ్యాఖ్యల వల్ల సమాజంలో జీరో కావడం తప్ప ఎలాంటి ప్రయోజనం ఉండదని హితవు పలికారు. బోడేపూడి రాజా వంటి వ్యక్తుల ప్రవర్తన వల్ల కాంగ్రెస్ పార్టీకే తీవ్ర నష్టం జరుగుతుందని, ఈ విషయాన్ని ఆ పార్టీ అగ్రనేతలు గ్రహించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ వలరాజు, బీఆర్ఎస్ యూత్ నాయకులు మోరంపూడి సాయి కృష్ణ, విజేత, హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు.

