కలం, కరీంనగర్ బ్యూరో: సమాజంలో శాంతిభద్రతల పరిరక్షణ, అక్రమ కార్యకలాపాల నియంత్రణే లక్ష్యంగా శుక్రవారం కరీంనగర్ (Karimnagar) జిల్లా మానకొండూరు మండలం వెల్ది గ్రామంలో భారీ స్థాయిలో ‘కార్డన్ అండ్ సెర్చ్’ (Cordon and Search) ఆపరేషన్ నిర్వహించారు. కరీంనగర్ రూరల్ ఏసీపీ విజయ్ కుమార్ (ACP Vijay Kumar) ఆధ్వర్యంలో జరిగిన ఈ తనిఖీల్లో పోలీసులు పెద్ద ఎత్తున సోదాలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో ముగ్గురు సీఐలు, ఏడుగురు ఎస్ఐలు, 11 మంది ఏఎస్ఐలు/హెడ్ కానిస్టేబుళ్లు, 18 మంది పోలీస్ కానిస్టేబుళ్లు, ఏడుగురు మహిళా పోలీస్ కానిస్టేబుళ్లు, 24 మంది స్పెషల్ యాక్షన్ టీమ్ (SAT) సిబ్బందితో కలిపి మొత్తం 72 మంది పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
కార్యక్రమంలో భాగంగా గ్రామంలోని సుమారు 350 మంది ప్రజలతో పోలీసులు ప్రత్యక్షంగా మాట్లాడి వారి సమస్యలు తెలుసుకుని అవగాహన కల్పించారు. అదే సమయంలో గ్రామంలో వాహనాల ధృవీకరణ తనిఖీలు చేపట్టి 76 ద్విచక్ర వాహనాలు, ఒక త్రిచక్ర వాహనాన్ని పరిశీలించారు. అక్రమ ఇసుక నిల్వలు, రవాణాపై ప్రత్యేక దృష్టి సారించిన పోలీసులు ఇసుకతో లోడ్ చేసిన 2 ట్రాక్టర్లు, ఇంజిన్ లేని 2 ఇసుక ట్రైలర్లు, 6 అక్రమ ఇసుక డంపులను స్వాధీనం చేసుకున్నారు.
ఈ సందర్భంగా రూరల్ ఏసీపీ విజయ్ కుమార్ మాట్లాడుతూ.. అక్రమ ఇసుక రవాణా, నిల్వలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నిబంధనలు ఉల్లంఘించే వారిపై మూడు దశల్లో చర్యలు తీసుకుంటామని తెలిపారు. మొదటి తప్పిదానికి భారీ జరిమానా విధిస్తామని, రెండోసారి నేరానికి పాల్పడితే బైండోవర్ చర్యలు చేపడతామని, మూడోసారి పట్టుబడితే సంబంధిత వాహనాలను శాశ్వతంగా స్వాధీనం చేసుకుంటామని స్పష్టం చేశారు. చట్టాన్ని ఉల్లంఘించే వారెవరైనా కఠిన చట్టపరమైన చర్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందని ఏసీపీ హెచ్చరించారు.
Read Also: హఠాత్తుగా కుంగిన భూమి.. ఎక్కడంటే?
Follow Us On: Instagram

