కరీంనగర్ దోపిడీ కేసులో పోలీసుల బిగ్ యాక్షన్

కలం, కరీంనగర్ బ్యూరో: కరీంనగర్‌లో (Karimnagar) సంచలనం సృష్టించిన పీ.యం.జే. జ్యువెలర్స్ (PMJ Jewellers Robbery) దోపిడీ కేసులో పోలీసులు కీలక చర్యలు చేపట్టారు. దోపిడీకి పాల్పడిన అంతర్రాష్ట్ర ముఠాలోని ఐదుగురు నిందితులపై కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం పీడీ యాక్ట్ కింద నిర్బంధ ఉత్తర్వులు జారీ చేశారు. 2026 మే 3న కరీంనగర్ పట్టణంలోని పీ.యం.జే. జ్యువెలర్స్‌లోకి చొరబడిన అంతర్రాష్ట్ర దోపిడీ ముఠా.. సిబ్బందిపై తుపాకులతో కాల్పులకు తెగబడింది. అనంతరం క్షణాల వ్యవధిలో దాదాపు రూ.82 లక్షల విలువైన బంగారు ఆభరణాలను దోచుకుని పరారైంది. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించింది. కేసు నమోదు చేసిన కరీంనగర్ పోలీసులు ప్రత్యేక దర్యాప్తు చేపట్టి ఇప్పటివరకు ఎనిమిది మంది నిందితులను అరెస్ట్ చేశారు. తాజాగా ప్రధాన నిందితులలో ఐదుగురిపై పీడీ యాక్ట్ ప్రయోగించారు.

పీడీ యాక్ట్ కింద ఐదుగురు

సమాజ భద్రతను దృష్టిలో ఉంచుకొని, శాంతిభద్రతలకు విఘాతం కలిగించే ఈ నేరస్థులపై సోమవారం సీపీ గౌష్ ఆలం పీడీ యాక్ట్ ఉత్తర్వులు జారీ చేశారు. ఆ ఐదుగురు నిందితులలో

  • రఘునాథ్ కర్మాకర్ అలియాస్ జాగీరా సింగ్ (41) – పశ్చిమ బెంగాల్
  • రావిష్ కుమార్ అలియాస్ ప్రద్యుమాన్ (23) – నలంద జిల్లా, బీహార్
  • సూర్యమణి కుమార్ అలియాస్ సనోజ్ (21) – నలంద జిల్లా, బీహార్
  • యాదవ్ అలియాస్ జైనుల్ అబ్దిన్ (33)– ఫుల్వారీ షరీఫ్, పాట్నా జిల్లా, బీహార్
  • మొహమ్మద్ ఆదిల్ ఖాన్ (31)– ఫుల్వారీ షరీఫ్, పాట్నా జిల్లా, బీహార్ లు ఉన్నారు.

కరీంనగర్ జిల్లా జైలులో ఉన్న నిందితులకు ఈ పీడీ యాక్ట్ ఉత్తర్వులను అందజేసిన పోలీసులు, వారిని వెంటనే హైదరాబాద్‌లోని చర్లపల్లి కేంద్ర కారాగారానికి తరలించారు.

పోలీసు అధికారులకు సీపీ అభినందనలు

కేసు దర్యాప్తుతో పాటు పీడీ యాక్ట్ ప్రక్రియను పూర్తి చేయడంలో కీలక పాత్ర పోషించిన పోలీసు అధికారులను సీపీ గౌష్ ఆలం ప్రత్యేకంగా అభినందించారు. కరీంనగర్ పట్టణ ఏసీపీ ఎన్. వెంకటస్వామి, రెండో పట్టణ సీఐ కె. సృజన్ రెడ్డి, పీడీ సెల్ సిబ్బంది పండరి, హెడ్ కానిస్టేబుల్ శంకర్‌లను ప్రశంసించారు. ఈ సందర్భంగా సీపీ గౌష్ ఆలం మాట్లాడుతూ ప్రజల భద్రతకు భంగం కలిగించే ఎలాంటి నేరాలకు పాల్పడినా కఠినంగా వ్యవహరిస్తామని స్పష్టం చేశారు. నేరస్థులలో భయాన్ని కలిగించడంతో పాటు శాంతిభద్రతలను కాపాడేందుకే ఈ చట్టపరమైన చర్యలు తీసుకున్నామని తెలిపారు. శాంతిభద్రతల పరిరక్షణలో రాజీ పడే ప్రసక్తే లేదని, నేరస్థుల పట్ల కఠినంగా వ్యవహరిస్తామని కరీంనగర్ కమిషనరేట్ పోలీసులు మరోసారి స్పష్టం చేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>