కలం, కరీంనగర్ బ్యూరో: ఉత్తరాఖండ్ రాష్ట్రంలో జరిగే ఆల్ ఇండియా కౌన్సిల్ ఆఫ్ మేయర్స్ 117వ సమావేశాల్లో గౌరవ అతిథిగా పాల్గొనాల్సిందిగా కరీంనగర్ మేయర్ కొలగాని శ్రీనివాస్ (Kolagani Srinivas)కు ఋషికేష్ నగరపాలక సంస్థ ఆహ్వానం పలికింది. ఈ మేరకు సోమవారం రోజున ఋషికేష్ నగరపాలక సంస్థ నుండి మేయర్ కోలగాని శ్రీనివాస్కు ఆహ్వాన పత్రికను పంపించారు. జూన్ 3, 4 తేదీల్లో ఋషికేశ్ నగర పాలక సంస్థ ఆధ్వర్యంలో ఆల్ ఇండియా కౌన్సిల్ ఆఫ్ మేయర్స్ అధ్యక్షురాలు రేణు బాల గుప్తా అధ్యక్షతన ఈ సమావేశాలు నిర్వహించనున్నారు. ముఖ్యఅతిథిగా ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి హాజరుకానున్నారు. ఆమెతో పాటు పలువురు కేబినెట్ మంత్రులు, రాజ్యసభ, లోక్సభ సభ్యులు హాజరవనున్నారు. ఆల్ ఇండియా కౌన్సిల్ ఆఫ్ మేయర్స్ కార్యదర్శి, ఆహ్వాన కర్త మనోజ్ గుప్తా, సహ ఆహ్వాన కర్త, ఋషి కేష్ నగరపాలక సంస్థ మేయర్ రణజాయ్ పాన్వర్ల ఆహ్వానం మేరకు మేయర్ శ్రీనివాస్ ఈ సమావేశాల్లో పాల్గొననున్నారు. ప్రధానంగా ఈ సమావేశాల్లో దేశంలోని వివిధ రాష్ట్రాల మేయర్లు పాల్గొని పట్టణాభివృద్ధి, నగర పాలన, ప్రజా సేవల మెరుగుదల, స్మార్ట్ సిటీ కార్యక్రమాలు తదితర అంశాలపై చర్చించనున్నారు.

