కలం, వెబ్ డెస్క్: కోస్గి పాంచజన్య సంకల్ప సభా వేదికగా టీఆర్ఎస్ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత (Kalvakuntla Kavitha) కీలక వ్యాఖ్యలు చేశారు. తనను కాంగ్రెస్ విడిచిన బాణమని బీఆర్ఎస్ వాళ్లు, కేసీఆర్ వదిలిన బాణమని కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారని.. మరికొందరైతే బీజేపీ వదిలిన బాణమని మాట్లాడుతున్నారని మండిపడ్డారు. అవేవీ తాను కాదని.. “తెలంగాణ బహుజనుల బాణాన్ని నేను” అంటూ వ్యాఖ్యానించారు. అంబేడ్కర్ వాదాన్ని, మహాత్మ జ్యోతిబా పులే ఆత్మగౌరవ నినాదాన్ని తాను అంటూ చెప్పుకొచ్చారు.
సావిత్రి భాయి పూలే ఆశయాలు నింపుకొని మగ మహారాజులకు ఛాలెంజ్ చేస్తున్న వీరవనితను తాను అంటూ సభలో (Kosgi TRS Sankalpa Sabha) ప్రసంగించారు. బహుజన రాజ్యం రావాలంటే కాంగ్రెస్ ను గద్దె దించాల్సిందేనని విమర్శించారు. పాలమూరు ప్రజలు ఆశీర్వదిస్తే రేవంత్ రెడ్డి, కేసీఆర్, మోడీలతో కోట్లాది తెలంగాణ హక్కులను సాధిస్తానని అన్నారు. ఒక మహిళ ఎవరి మద్దతు లేకుండా రాజకీయంగా నిలబడుతుందని నిరూపించడానికే రాజకీయ పార్టీ పెట్టి ప్రజల మద్దతు కోరుతున్నట్లు తెలిపారు. 29 రాష్ట్రాలున్న ఈ దేశంలో ఒక్క రాష్ట్రానికి మాత్రమే ముఖ్యమంత్రిగా మహిళ ఉన్నారని చెప్పుకొచ్చారు. చరిత్ర తిరగరాద్దామా? అంటూ రాష్ట్ర ప్రజానీకాన్ని కవిత కోరారు.

