కలం, మహబూబ్ నగర్ బ్యూరో: ఉమ్మడి పాలమూరు జిల్లాకు వరప్రదాయినిగా ఉన్న ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు (Jurala Project) ఎగువన కురుస్తున్న వర్షాలతో జళకళ సంతరించుకుంది. నైరుతి రుతుపవనాల ప్రభావంతో జూరాల ఎగువ ప్రాంతాలలో కురిసిన వర్షాలకు కృష్ణానదిలోకి వరద నీరు వచ్చి చేరుతోంది. క్రమక్రమంగా రిజర్వాయర్లో నీటిమట్టం స్వల్పంగా పెరుగుతుండడంతో ఆయకట్టు రైతాంగంతో పాటు ఇరిగేషన్ అధికారులు సైతం ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.
ఎగువ ప్రాంతంలోని ఆల్మట్టి, నారాయణపూర్ జలాశయాల నుండి నీరు రాకున్నప్పటికీ పరివాహక ప్రాంతం నుండి వచ్చిన వర్షపు నీటితో ప్రాజెక్టు జలకళ సంతరించుకుంది. జూరాలకు వస్తున్న వర్షపు నీటిని దృష్టిలో పెట్టుకొని ఇప్పటికే నెట్టెంపాడు ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మించిన గూడెందొడ్డి రిజర్వాయర్కు పంపు మోటార్ల ద్వారా నీటిని విడుదల చేశారు. ఆదివారం ఉదయానికి జూరాల ప్రాజెక్టులో 318.516 మీటర్లకు గాను 317.670 మీటర్ల స్థాయిలో నీరు నిల్వ ఉంది.
జూరాలకు ఎగువ ప్రాంతం నుండి 1,972 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతుండడంతో ప్రాజెక్టు వద్ద జలకళ కన్పిస్తోంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 318.516 మీటర్లు, 9,657 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 7.517 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్టు ప్రాజెక్టు అధికారులు తెలిపారు. జూరాలలో ప్రస్తుతం ఉన్న నీటి నిల్వతో పాటు వర్షపు నీరు చేరుతుండడంతో అన్నదాతలు ముందస్తు నారుమళ్లు సిద్ధం చేస్తున్నారు.

