కలం, వెబ్ డెస్క్: బీఆర్ఎస్ ప్రభుత్వంలో రూ.8.21 లక్షల కోట్లు అప్పులు చేశారని, తాను చెప్పింది తప్పని తేలితే వెంటనే రాజీనామా చేస్తానని మంత్రి జూపల్లి కృష్ణారావు (Jupally Krishna Rao) సంచలన ప్రకటన చేశారు. పారిపోవడం తమ ఇంటావంటా లేదన్నారు. ఎక్కడెక్కడ అప్పులు చేశారో, పాయింట్ల వారీగా స్పష్టంగా హరీశ్ రావుకు పంపించినట్లు తెలిపారు. కట్టు కథలతో తిరిగి తనకు లెటర్ పంపించారని మండిపడ్డారు. బీఆర్ఎస్ చేసిన అప్పులకు తాము రూ.2.08 లక్షల కోట్లు వడ్డీలు కట్టినట్లు వివరించారు. పదేళ్లు పాలించి ఇప్పుడు అబద్దాలు చెబుతానంటే కుదరదన్నారు.
భయపడుతున్న హరీశ్ రావు..
మిషన్ భగీరథ పేరిట రూ.40 వేల కోట్ల అప్పు చేశారని, కాళేశ్వరం కార్పొరేషన్ ద్వారా కూడా అప్పులు చేసినట్లు మంత్రి జూపల్లి వివరించారు. నిజాలు చెప్పడానికి కూడా హరీశ్ రావు భయపడుతున్నారని, అందుకే తనకు సమాధానం చెప్పకుండా పలాయనవాదం అందుకున్నారని విమర్శించారు. దమ్ముంటే, హరీశ్ రావు, కేటీఆర్ తాను చెప్పిన లెక్కలు తప్పని నిరూపించాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై బురద జల్లి పారిపోదామనుకుంటున్నారని, అది వారి వల్ల కాని పని అని కుండబద్దలు కొట్టారు.

