కలం, వెబ్ డెస్క్: తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని జూన్ 2న నిర్వహించాలనుకున్న తెలంగాణ నవ నిర్మాణ సంకల్ప సభ – జనసేన సాధక్ సమ్మేళనం కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వం అనుమతి నిరాకరించడంపై జనసేన (Janasena) పార్టీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. గచ్చిబౌలిలోని సంధ్య కన్వెన్షన్ హాల్లో సుమారు 2000 మంది క్రియాశీలక కార్యకర్తలతో ఇండోర్ సమావేశం నిర్వహించాలని పార్టీ భావించింది. రాష్ట్ర అభివృద్ధిలో జనసేన పాత్ర, భవిష్యత్ కార్యాచరణపై దిశానిర్దేశం చేసుకునేందుకు తలపెట్టిన ఈ కార్యక్రమానికి అనుమతి ఇవ్వకపోవడం అర్థరహితమని పార్టీ సోషల్ మీడియా వేదికగా మండిపడింది.
సంధ్య కన్వెన్షన్ హాల్లో నిత్యం అనేక రాజకీయ, సాంస్కృతిక, కార్పొరేట్ సమావేశాలు జరుగుతుంటాయని, కేవలం జనసేన సభకు మాత్రమే పార్కింగ్ సమస్యను సాకుగా చూపడం సరికాదని జనసేన నేతలు విమర్శించారు. ప్రొఫెసర్ నాగేశ్వర్ వ్యాఖ్యల నేపథ్యంలో తలెత్తిన వివాదంపై పవన్ కల్యాణ్ గారే స్వయంగా స్పందించి, ఎటువంటి చర్యలు ఉండవని స్పష్టం చేసినా ప్రభుత్వం ఇలా వ్యవహరించడం సరికాదని వారు పేర్కొన్నారు. శాంతియుతంగా కార్యకర్తలతో సమావేశం నిర్వహించుకునే హక్కును కాలరాయడం ప్రజాస్వామ్య విరుద్ధమని జనసేన ఆవేదన వ్యక్తం చేసింది.

