కలం, వెబ్ డెస్క్: పెట్రోల్, డీజిల్ కృత్రిమ కొరత సృష్టించి, దాని ద్వారా దోచుకునే పర్వానికి కూటమి నాయకులు సిద్ధమయ్యారని వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ (JAGAN) విమర్శించారు. పొరుగున ఉన్న తమిళనాడు, కర్ణాటక, తెలంగాణలో ఎక్కడా పెట్రోల్, డీజిల్ కొరత లేదని.. సరఫరాలో సంక్షోభం లేదన్నారు. కానీ, ఏపీలో డీలర్లు, కూటమి నాయకులు కుమ్మక్కవడంతో ఏర్పడిందని మండిపడ్డారు. అయిదు రాష్ట్రాల ఎన్నికలు పూర్తి కాగానే, ధరలు పెంచుతారని భావిస్తున్న డీలర్లు పెట్రోల్, డీజిల్ బ్లాక్ చేస్తున్నారని ఆరోపించారు. వారితో కూటమి నాయకులు కలిసిపోయి దోపిడీకి సిద్ధమయ్యాన్నారు. సరఫరా మరింత తగ్గుతుందన్న భయంతో వాహనదారులు పెద్ద ఎత్తున పెట్రోల్, డీజిల్ కొనుగోలు చేస్తున్నందువల్ల డిమాండ్ పెరిగి, కొరత ఏర్పడిందని కుంటి సాకులు చెబుతున్నారని దుయ్యబట్టారు.
‘రైతులకు తీవ్ర ఇబ్బందులు..’
పెట్రోల్, డీజిల్ సంక్షోభం కారణంగా రైతులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారని వైసీపీ అధినేత జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు సమగ్రమైన రివ్యూ కూడా చేయకుండా, కేవలం లీకులతో సరి పెడుతున్నారని విమర్శించారు. ట్రాక్టర్లు, వ్యవసాయ యంత్రాలకు తగిన డీజిల్ అందక పంటల కోత కాలంలో ఈ సంక్షోభం మరింత తీవ్రమైందన్నారు. కోత యంత్రాలకు రోజుకు సుమారు 100 నుంచి 160 లీటర్ల డీజిల్ అవసరం ఉండగా, సరఫరా లేకపోవడంతో యంత్రాలు పొలాల్లోనే నిలిచిపోతున్నాయని వివరించారు. ఆక్వా రైతుల అవస్థలు అన్నీ ఇన్నీ కావన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే స్పందించి.. సరఫరా పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు.

