కలం, స్పోర్ట్స్ : కోల్కతా నైట్ రైడర్స్ (KKR) జట్టుకు రాబోయే ఐపీఎల్ సీజన్లో ‘స్పిన్’ సెగ తగిలేలా కనిపిస్తోంది. భారీ ధర వెచ్చించి ఆటగాళ్లను కొనుగోలు చేసినప్పటికీ, మిడిల్ ఓవర్లలో స్పిన్నర్లను ఎదుర్కోవడంలో కేకేఆర్ బ్యాటర్లు తడబడే అవకాశం ఉందని మాజీ ఆల్రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ (Irfan Pathan) విశ్లేషించారు. గత ఏడాది వేలంలో కేకేఆర్ దగ్గర అత్యధికంగా 64.30 కోట్ల రూపాయల పర్స్ వాల్యూ ఉంది. దీనితో వారు కెమెరూన్ గ్రీన్ (రూ. 25.20 కోట్లు), మతీషా పతిరానా (రూ. 18 కోట్లు) వంటి స్టార్ ప్లేయర్లను దక్కించుకున్నారు. అయితే, శ్రేయస్ అయ్యర్, నితీష్ రాణా వంటి ఆటగాళ్లు జట్టును వీడిన తర్వాత ఏర్పడిన స్పిన్ లోటును మేనేజ్మెంట్ భర్తీ చేయలేకపోయిందని పఠాన్ అభిప్రాయపడ్డారు.
వెస్టిండీస్ పవర్ హిట్టర్ రోవ్మన్ పోవెల్ తన దేశం తరపున బాగానే ఆడుతున్నా, ఐపీఎల్ తరహా స్పిన్ బౌలింగ్ను ఎదుర్కోవడంలో అతనికి ఇబ్బందులు తప్పవని పఠాన్ పేర్కొన్నారు. ఇక అజింక్యా రహానే టాప్ ఆర్డర్లో రాణిస్తున్నా, మిడిల్ ఓవర్లలో స్పిన్కు వ్యతిరేకంగా అతని స్ట్రైక్ రేట్ దాదాపు 100కు పడిపోతుందని గుర్తు చేశారు. రింకూ సింగ్, రమణదీప్ సింగ్ వంటి ఆటగాళ్లు పేస్ బౌలింగ్ను సమర్థవంతంగా ఎదుర్కొంటారని, కానీ స్పిన్ విషయంలో వారి ప్రదర్శన ప్రశ్నార్థకంగానే ఉందని పఠాన్ (Irfan Pathan) విశ్లేషించారు.
వేలంలో ప్రధానంగా ఈ సమస్యపై దృష్టి పెట్టాల్సింది పోయి, కేకేఆర్ దానిని విస్మరించిందని ఆయన తన యూట్యూబ్ ఛానెల్ ద్వారా వెల్లడించారు. ఏదేమైనా, ఈ స్పిన్ బలహీనత కేకేఆర్ ఫలితాలపై ఎంతవరకు ప్రభావం చూపుతుందో వేచి చూడాలి. మార్చి 29న వాంఖడే స్టేడియంలో ముంబై ఇండియన్స్తో జరిగే తొలి మ్యాచ్తో కోల్కతా తన ప్రయాణాన్ని ప్రారంభించనుంది.
Read Also: ఆర్ఆర్ను అడ్డుకోవడం ఎవరి వల్లా కాదు: అశ్విన్
Follow Us On: Instagram

