కలం, వెబ్ డెస్క్ : హర్మూజ్ (Hormuz) జలసంధి నుంచి భారత్ వస్తున్న నౌకపై ఇరాన్ సైన్యం దాడికి దిగడం సంచలనంగా మారింది. రెండు మిలియన్ బ్యారెళ్ల చమురును తీసుకొస్తున్న నౌక.. హర్మూజ్ జలసంధిలోకి ప్రవేశించిన కొద్దిసేపటికే IRGC సిబ్బంది కాల్పులు జరిపినట్లు తెలుస్తోంది. శనివారం ఈ ఘటన చోటు చేసుకుంది. నౌకపై భారత జెండా స్పష్టంగా కనిపిస్తున్నా.. IRGC ఎందుకు కాల్పులు జరిపిందనేది తెలియరాలేదు. ప్రస్తుతం నౌకలోని సిబ్బంది క్షేమంగా ఉన్నారని.. పూర్తి వివరాలు తెలియాల్సి ఉందని విదేశాంగ వర్గాలు వెల్లడించాయి.
భారత్ తీవ్ర ఆగ్రహం..
హర్మూజ్ జలసంధిలో భారత నౌకపై దాడి విషయాన్ని కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది. దిల్లీలోని ఇరాన్ దౌత్యవేత్తకు సమన్లు జారీ చేసి, వివరణ తీసుకోవాలని విదేశాంగ శాఖ నిర్ణయం తీసుకుంది. పశ్చిమాసియాలో యుద్ధం మొదలయ్యాక.. భారత నౌకపై దాడి జరగడం ఇదే మొదటిసారి. పొరపాటున జరిగిందా.. లేదా ఉద్దేశపూర్వకంగానే కాల్పులు జరిపారా.. అనే అంశాన్ని కేంద్ర ప్రభుత్వ వర్గాలు లోతుగా ఆరా తీస్తున్నట్లు సమాచారం.

