కలం, వరంగల్ : రాష్ట్రవ్యాప్తంగా జరిగిన ఐపీఎస్ అధికారుల బదిలీల్లో భాగంగా వరంగల్ పోలీస్ కమిషనర్గా కీలక మార్పు చోటుచేసుకుంది. ప్రస్తుతం వరంగల్ సీపీగా ఉన్న సన్ప్రీత్ సింగ్ను సైబరాబాద్ ట్రాఫిక్ జాయింట్ కమిషనర్గా బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన స్థానంలో 2012 బ్యాచ్కు చెందిన ఐపీఎస్ అధికారి ఎన్. శ్వేతను వరంగల్ కొత్త పోలీస్ కమిషనర్గా నియమించింది. ప్రస్తుతం ఆమె హైదరాబాద్ నార్త్ రేంజ్ జాయింట్ కమిషనర్గా విధులు నిర్వహిస్తున్నారు.
వరంగల్ కమిషనరేట్ చరిత్రలో కొత్త అధ్యాయం
వరంగల్ పోలీస్ కమిషనరేట్ ఆవిర్భావం తర్వాత తొలిసారిగా ఓ మహిళ పోలీస్ కమిషనర్గా బాధ్యతలు చేపట్టబోతుండటం విశేషం. ఇప్పటివరకు పలువురు పురుష ఐపీఎస్ అధికారులు కమిషనర్లుగా పనిచేసినప్పటికీ, మహిళా అధికారికి ఈ బాధ్యతలు అప్పగించడం ఇదే మొదటిసారి. దీంతో కమిషనరేట్ చరిత్రలో ఎన్. శ్వేత పేరు ప్రత్యేకంగా నిలవనుంది.
వరంగల్ నగరంతో పాటు కమిషనరేట్ పరిధిలో శాంతిభద్రతలు, నేరాల నియంత్రణ, మహిళల భద్రత, సైబర్ నేరాల నివారణ, ట్రాఫిక్ నిర్వహణ వంటి కీలక అంశాల్లో ఆమె నాయకత్వంపై ఆసక్తి నెలకొంది. కొత్త సీపీగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత కమిషనరేట్ పనితీరులో ఎలాంటి మార్పులు తీసుకువస్తారనే అంశంపై పోలీసు వర్గాలతో పాటు ప్రజల్లో కూడా చర్చ జరుగుతోంది.

