కలం, జనగామ: జనగామ (Jangaon) జిల్లా కలెక్టరేట్లో రూ.37.85 లక్షల ప్రభుత్వ నిధుల దుర్వినియోగం జరిగినట్లు అంతర్గత విచారణలో తేలింది. ట్రెజరీ, పీఎఫ్ఎంఎస్ పరిధికి వెలుపల ఉన్న ప్రైవేట్ బ్యాంకు ఖాతా ద్వారా నకిలీ బిల్లులు సృష్టించి ఫర్నీచర్, కంప్యూటర్లు కొనుగోలు చేసినట్లుగా తప్పుడు రికార్డులు నమోదు చేసి.. ఈ నిధులు మళ్లించినట్లు అధికారులు గుర్తించారు.
ముగ్గురు ఉద్యోగులపై వేటు..
ఈ ఘటనకు బాధ్యులైన ముగ్గురు ఉద్యోగులను సస్పెండ్ చేయడంతో పాటు వారిపై శాఖాపరమైన చర్యలు ప్రారంభించినట్లు కలెక్టరేట్ వర్గాలు వెల్లడించాయి. అంతేగాకుండా, జిల్లా పరిపాలనా విభాగం ఫిర్యాదు మేరకు జనగామ టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఇకపై ఇలాంటి ఘటనలు జరగకుండా ట్రెజరీ వెలుపల ఉన్న ప్రభుత్వ ఖాతాలపై ప్రత్యేక తనిఖీలు నిర్వహించి, నెలవారీ ఆడిట్ను తప్పనిసరి చేయాలని జిల్లా యంత్రాంగం నిర్ణయించింది. దర్యాప్తు కొనసాగుతున్న నేపథ్యంలో నిందితుల పేర్లను వెల్లడించడం లేదని డీపీఆర్వో విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు.

