కలం, నల్లగొండ బ్యూరో : ఇండ్లు లేని ప్రతి పేద కుటుంబానికి విడతల వారీగా ఇందిరమ్మ ఇండ్లు అందిస్తానని నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం (Vemula Veeresham) తెలిపారు. యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం ఇంద్రపాలనగరంకి చెందిన ఏర్వ మమత-గణేష్ నూతన గృహప్రవేశ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు. తమ ప్రభుత్వం నకిరేకల్ నియోజకవర్గానికి తొలివిడతగా 3,500 ఇందిరమ్మ ఇండ్లు కేటాయించిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలోనే పేదలకు ఇందిరమ్మ ఇండ్లు వచ్చాయని, గత ప్రభుత్వ పదేళ్ల పాలనలో ఒక్క పేదవాడికి కూడా ఇల్లు ఇవ్వలేదని ఎమ్మెల్యే వీరేశం (Vemula Veeresham) విమర్శించారు. పేదల జీవన ప్రమాణాలు మెరుగు పరచడం ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని, అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందేలా కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ వైస్ చైర్మన్ సిరిగిరెడ్డి మల్లారెడ్డి, మండల ప్రజాప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.


