కలం, వెబ్ డెస్క్ : దేశీయ బయోఫ్యూయల్ రంగాన్ని మరింత బలోపేతం చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దిగుమతి చేసుకునే ముడి చమురుపై ఆధారపడటాన్ని తగ్గించుకోవడానికి, పర్యావరణ హితమైన ఇంధన వినియోగాన్ని ప్రోత్సహించడానికి 22 శాతం నుండి 30 శాతం వరకు ఇథనాల్ కలిపిన పెట్రోల్ (Ethanol Blended Petrol)పై కేంద్ర ఎక్సైజ్ సుంకాన్ని పూర్తిగా రద్దు చేసింది. బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (BIS) నిబంధనలకు అనుగుణంగా ఉండే E22, E25, E27, E30 ఇంధన రకాలకు ఈ మినహాయింపులు వర్తిస్తాయని ఆర్థిక మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. బేసిక్ ఎక్సైజ్ సుంకం, ప్రత్యేక అదనపు ఎక్సైజ్ సుంకం, రోడ్డు, మౌలిక సదుపాయాల సెస్ (RIC) తో పాటు వ్యవసాయ మౌలిక సదుపాయాల అభివృద్ధి సెస్ (AIDC) ల నుండి ఈ ఇంధన మిశ్రమాలకు పూర్తి మినహాయింపు లభించనుంది.
ఎవరికి ఉపయోగం..?
అయితే ఈ నిర్ణయం భవిష్యత్తు వ్యూహంలో భాగమే అయినప్పటికీ, ప్రస్తుత పరిస్థితులను కూడా గమనించాల్సి ఉంది. ప్రస్తుతం దేశంలోని సుమారు 99 శాతం పెట్రోల్ బంకుల్లో కేవలం E20 (20 శాతం ఇథనాల్) ఇంధనాన్ని మాత్రమే విక్రయిస్తున్నారు. రోడ్లపై తిరుగుతున్న దాదాపు 23.4 కోట్ల పాత వాహనాలు E20 ఇంధనానికే పూర్తిగా అనుకూలంగా లేవు. ఇటువంటి తరుణంలో వాహన సామర్థ్యం మైలేజీపై ఇథనాల్ శాతం ప్రభావం చూపుతుందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఉదాహరణకు కార్స్24 నిర్వహించిన BS4 స్విఫ్ట్ మైలేజ్ పరీక్షలో సాధారణ XP100 ప్రీమియం ఇంధనంతో లీటరుకు 22 కిలోమీటర్ల మైలేజ్ రాగా, E20 ఇంధనంతో అది 15 కిలోమీటర్లకు పడిపోయినట్లు తేలింది. ఈ నేపథ్యంలో E20 వాహనాలలో అంతకంటే ఎక్కువ మోతాదు గల E30 ఇంధనాన్ని వాడితే ఇంజిన్ పనితీరుపై ఎలాంటి ప్రభావం పడుతుందనే అంశంపై వాహనదారుల్లో చర్చ జరుగుతోంది. ప్రభుత్వం కూడా ఉన్నపళంగా ఈ ఇంధనాన్ని (Ethanol Blended Petrol) మార్కెట్లోకి తేవడం లేదని, ముందస్తు పరీక్షలు, వాహన అనుకూలతలను పరిశీలించిన తర్వాతే దశలవారీగా అందుబాటులోకి తెస్తామని స్పష్టం చేసింది.
Read Also: విశాఖ స్టీల్ ప్లాంట్లో పేలుడు.. NHRC సీరియస్
Follow Us On: Sharechat

