కలం, వెబ్ డెస్క్: ఏపీ శాసన మండలి (AP Legislative Council) సమావేశాలు శుక్రవారం ఏడవ రోజు ప్రారంభమయ్యాయి. వైసీపీ సభ్యులు మళ్లీ ఇందాపూర్ (Indapur) డెయిరీపై చర్చకు డిమాండ్ చేశారు. వైసీపీ సభ్యలు సభలోకి ప్లకార్డులు, వేంకటేశ్వరస్వామి ఫోటోలతో వచ్చి నిరసన వ్యక్తం చేశారు. హెరిటేజ్, ఇందాపూర్ డెయిరీలు దేవుడి సొమ్మును లూటీ చేస్తున్నాయని బొత్స సత్య నారాయణ ఆరోపించారు. ఇందాపూర్ డెయిరీపై చర్చ జరగాల్సిందేనని పట్టుబట్టారు. హెరిటేజ్ దోపిడీని ప్రజలకు తెలియజేస్తామని హెచ్చరించారు. రెండు ప్రైవేటు సంస్థల గురించి మాట్లాడితే మంత్రులు ఎందుకు ఉలిక్కిపడుతున్నారని ప్రశ్నించారు. అడిగిన అంశాలపై సభలో చర్చిస్తే అన్నింటిపై క్లారిటీ వస్తుందని బొత్స అన్నారు. సభ ప్రారంభానికి ముందు వైసీపీ సభ్యులు అసెంబ్లీ ఎదుట వేంకటేశ్వరస్వామి చిత్రపటాలతో ర్యాలీ నిర్వహించారు.
మరోవైపు వైసీపీ సభ్యుల తీరుపై మంత్రి పయ్యావుల కేశవ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దేవుడి పటాన్ని సభలోకి తీసుకురావడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. వైసీపీ సభ్యులకు దేవుడిపై నమ్మకం లేదని విమర్శించారు. భగవంతుడిని రాజకీయాల్లోకి లాగుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సభలో నెలకొన్న గందరగోళంతో పయ్యావుల మైక్ తీసి అసహనంతో కింద పడేశారు. తీవ్ర ఉద్రిక్త పరిస్థితుల నడుమ చైర్మన్ సభను వాయిదా వేశారు.


