కలం, వెబ్ డెస్క్ : హైదరాబాద్ ఇబ్రహీంపట్నంలోని గురునానక్ ఇంజనీరింగ్ కళాశాల సమీపంలో బుధవారం రాత్రి రోడ్డు ప్రమాదం (Ibrahimpatnam Accident) చోటుచేసుకుంది. కళాశాలకు చెందిన ఐదుగురు విద్యార్థులు సాయంత్రం వాకింగ్ ముగించుకుని తిరిగి వస్తుండగా, మాల్ వైపు నుండి అధిక వేగంతో వచ్చిన ట్రాలీ ఆటో వారిపైకి దూసుకొచ్చింది.
ఈ ప్రమాదంలో హర్షవర్ధన్, శివరాజ్ అనే ఇద్దరు బీటెక్ విద్యార్థులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో ముగ్గురు విద్యార్థులకు తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న వెంటనే 108 సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను సమీప ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ప్రమాదానికి కారణమైన ట్రాలీ ఆటో వాహనం (TS 07 UN 0812) గా అధికారులు గుర్తించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.

