కలం, వెబ్ డెస్క్ : హైదరాబాద్లో (Hyderabad) ట్రాఫిక్ సమస్యలను తగ్గించేందుకు కీలక చర్యగా కేబీఆర్ పార్క్ (KBR Park) పరిసర ప్రాంతాలలో వన్వే ట్రాఫిక్ ట్రయల్ రన్ రెండో దశను ప్రారంభించినట్లు నగర పోలీస్ కమిషనర్ సజ్జనార్(CP Sajjanar) తెలిపారు. మొదటి దశలో గుర్తించిన సమస్యలను పరిష్కరించిన అనంతరం ఈ రెండో దశ ట్రయల్ను అమలు చేస్తున్నట్లు వెల్లడించారు. ఏప్రిల్ 5న జరిగిన తొలి ట్రయల్ వేసవి కాలంలో ట్రాఫిక్ తక్కువగా ఉన్న సమయంలో నిర్వహించామని, అయితే రెండో దశ ట్రయల్ను సాధారణ ట్రాఫిక్ పరిస్థితులను అంచనా వేసే విధంగా నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఆదివారం అయినప్పటికీ ట్రాఫిక్ పరిస్థితులను నిశితంగా పరిశీలిస్తున్నామని, వర్కింగ్ డేస్లో ట్రాఫిక్ మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
ఈ ట్రయల్ రన్ సందర్భంగా సుమారు 150 మంది ట్రాఫిక్ పోలీసులను విధులలో నియమించారు. అదనంగా గ్రేహౌండ్స్, ఆక్టోపస్ బృందాల సహాయంతో ట్రాఫిక్ నిర్వహణ చేపడుతున్నారు. వాహనదారులు సులభంగా ప్రయాణించేందుకు ప్రాంతమంతా సూచిక బోర్డులను ఏర్పాటు చేసి, ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని పోలీసులు సూచించారు. కేబీఆర్ పార్క్ చుట్టూ ట్రాఫిక్ రద్దీ తగ్గించేందుకు భవిష్యత్తులో ఏడు ఫ్లైఓవర్లు, ఏడు అండర్పాస్లు నిర్మించనున్నట్లు తెలిపారు. అలాగే పాదచారులు, వాకర్స్కు సురక్షితంగా రోడ్డు దాటేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేయనున్నారని పేర్కొన్నారు.
ఇకపై కేబీఆర్ పార్క్ వద్ద రోడ్డు పక్కన పార్కింగ్కు అనుమతి ఉండదని స్పష్టం చేశారు. అత్యవసర వాహనాలు, ముఖ్యంగా అంబులెన్స్ల రాకపోకలకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తామని అధికారులు తెలిపారు. ట్రాఫిక్ డైవర్షన్లు, వన్వే అమలు ప్రభావాన్ని సమగ్రంగా విశ్లేషించి, రోడ్ల వెడల్పు, యూటర్న్ల రూపకల్పనలో అవసరమైన మార్పులు చేపడతామని అదనపు ట్రాఫిక్ సీపీ జోయెల్ డేవిస్ వెల్లడించారు. నగర ట్రాఫిక్ను సులభతరం చేయడం లక్ష్యంగా ఈ ప్రయోగాత్మక చర్యలు చేపడుతున్నామని, ప్రజలు సహకరించాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు.

