కలం, వెబ్ డెస్క్ : హైదరాబాద్ లో రంగురంగుల మిఠాయిల తయారీ వెనుక దాగి ఉన్న చేదు నిజం వెలుగులోకి వచ్చింది. స్వీట్ల తయారీలో విషపూరితమైన పదార్థాలను వాడుతూ సామాన్యుల ప్రాణాలతో చెలగాటమాడుతున్న ముఠాను పోలీసులు గుర్తించారు. మైలార్దేవ్పల్లి (Mylardevpally) పోలీస్ స్టేషన్ పరిధిలోని సుభాన్ కాలనీ, లక్ష్మీగూడ ప్రాంతాల్లో గుట్టుచప్పుడు కాకుండా సాగుతున్న కల్తీ స్వీట్ల తయారీ కేంద్రాలపై పోలీసులు మెరుపు దాడులు నిర్వహించారు.
హానికరమైన రసాయనాలతో ఈ మిఠాయిలను తయారు చేస్తున్నట్లు అందిన పక్కా సమాచారంతో అధికారులు రంగంలోకి దిగారు. ఈ సోదాల్లో భాగంగా సుభాన్ కాలనీలోని లక్కీ ఫుడ్స్ కంపెనీ యజమాని అబ్దుల్ హక్ (54), అలాగే లక్ష్మీగూడలోని మెస్సర్స్ జీ ఫుడ్స్ యజమాని మహమ్మద్ ఖమరుద్దీన్ (70) ప్రజల ఆరోగ్యానికి ముప్పు కలిగించే విధంగా కల్తీ ఆహారాన్ని తయారు చేస్తున్నట్లు నిర్ధారించారు. కేవలం లాభాల కోసమే ఇలాంటి అక్రమాలకు పాల్పడుతున్న ఈ ఇద్దరు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఈ దాడుల్లో సుమారు ఒక లక్షా పది వేల రూపాయల విలువైన కల్తీ ఆహార పదార్థాలను, తయారీకి ఉపయోగించే ముడి సరుకులను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కల్తీ రంగులు, నాణ్యత లేని పదార్థాలతో తయారయ్యే ఇలాంటి స్వీట్ల పట్ల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు.

