కలం, స్పోర్ట్స్: చైనాలో జరిగే జూనియర్ ఆసియా కప్ కోసం భారత జట్టు ఖరారైంది. అన్మోల్ ఎక్కా (Anmol Ekka) కెప్టెన్గా 18 మంది సభ్యులతో జట్టును హాకీ ఇండియా ప్రకటించింది. ఆగస్టు 30 నుంచి సెప్టెంబర్ 13 వరకు మోకీలో జరిగే టోర్నీలో భారత్ బరిలోకి దిగనుంది. అర్జున్ సంతోష్ హర్గుడే, రితిక్ లాక్రాను ప్రత్యామ్నాయ ఆటగాళ్లుగా ఎంపిక చేశారు. ప్రస్తుతం బెంగళూరులోని సాయ్ కేంద్రంలో కొత్త కోచ్ ఫ్రెడరిక్ సోయెజ్ ఆధ్వర్యంలో జట్టు శిక్షణ కొనసాగుతోంది.
అంతర్జాతీయ జట్లతో పోటీ..
సన్నాహాల్లో భాగంగా హాకీ జట్టు ఇటీవల బెల్జియం వెళ్లి, అక్కడ బలమైన అంతర్జాతీయ జట్లతో పోటీ పడింది. దీంతో ఆటగాళ్లకు మంచి మ్యాచ్ అనుభవం లభించింది. జట్టు కూర్పును మరింత బలోపేతం చేసుకునే అవకాశం దక్కింది. అలాగే బెంగళూరులో మలేషియా అండర్-21 జట్టుతో స్నేహపూర్వక మ్యాచ్లు ఆడుతోంది. జట్టులో సమతుల్యత, లోతు ఉన్నాయని కోచ్ సోయెజ్ తెలిపారు.
ఆటగాళ్ల కృషి, క్రమశిక్షణ, ఒత్తిడిలో ప్రదర్శన ఆధారంగానే ఎంపిక చేశామని చెప్పారు. ప్రతి ప్రత్యర్థి బలమైనవాడేనని భావిస్తున్నామని వెల్లడించారు. క్రమశిక్షణతో పాటు దూకుడైన హాకీ ఆడటమే లక్ష్యమని తెలిపారు. ఈ టోర్నీ యువ ఆటగాళ్ల అభివృద్ధికి కీలకమని, దేశానికి మంచి ఫలితాలు అందించే సామర్థ్యం ఈ జట్టుకు ఉందని విశ్వాసం వ్యక్తం చేశారు.

