కలం, జనగామ : జనగామ (Jangaon) జిల్లాలో అకాల వర్షం(Unseasonal Rain) రైతులను తీవ్రంగా దెబ్బతీసింది. కొనుగోలు కేంద్రాలు, మార్కెట్ యార్డులలో రోజుల తరబడి నిల్వ ఉన్న ధాన్యం రాశులు భారీ వర్షానికి పూర్తిగా తడిసిపోయాయి. దీంతో రైతుల కష్టం కళ్లముందే కరిగిపోతోంది. పొలం నుంచి తీసుకొచ్చిన ధాన్యాన్ని రైతులు రోజుల తరబడి మార్కెట్ యార్డులు, కొనుగోలు కేంద్రాలలోనే నిల్వ చేశారు. కానీ కొనుగోలు ప్రక్రియ ఆలస్యం కావడం, లారీల కొరత కారణంగా ధాన్యం మిల్లులకు తరలించడంలో తీవ్ర జాప్యం ఏర్పడింది.
ఈ లోపే అకాల వర్షం కురవడంతో పరిస్థితి పూర్తిగా మారిపోయింది. జనగామ (Jangaon) జిల్లా వ్యవసాయ మార్కెట్లో ఎక్కడ చూసినా తడిసిన ధాన్యం రాశులు, నీటిలో నానిన ధాన్యం మూటలు కనిపిస్తున్నాయి. సరైన టార్పాలిన్ కవర్లు లేకపోవడం, అధికారుల నిర్లక్ష్యం కారణంగా వర్షం వచ్చిన వెంటనే ధాన్యాన్ని కాపాడే చర్యలు తీసుకోలేదని రైతులు ఆరోపిస్తున్నారు.
‘నెలల తరబడి కష్టపడి పండించిన పంట కళ్లముందే పాడైపోతోంది’ అంటూ రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తడిసిన ధాన్యాన్ని మిల్లర్లు తిరస్కరిస్తారనే భయంతో వారు కన్నీరు మున్నీరవుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకుని తడిసిన ధాన్యాన్ని ప్రత్యేకంగా కొనుగోలు చేయాలని, పెండింగ్లో ఉన్న ధాన్యాన్ని వెంటనే తరలించేందుకు అదనపు లారీలను ఏర్పాటు చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. అలాగే అకాల వర్షంతో నష్టపోయిన రైతులకు తక్షణమే పరిహారం ప్రకటించాలని రైతు సంఘాలు కోరుతున్నాయి.
Read Also: సీఎంగా విజయ్.. రేపు ప్రమాణ స్వీకారం!
Follow Us On : WhatsApp

